రైతులకు పింఛన్‌ ఇచ్చే యోచనలో కేసీఆర్?

ABN , First Publish Date - 2022-01-12T22:20:53+05:30 IST

సీఎం కేసీఆర్ మరో చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు

రైతులకు పింఛన్‌ ఇచ్చే యోచనలో కేసీఆర్?

హైదరాబాద్: సీఎం కేసీఆర్ మరో చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రైతులకు పింఛన్‌ ఇచ్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే బడ్జెట్‌లో సరికొత్త పథకానికి ప్రకటించేందుకు సీఎం సిద్ధం అవుతున్నట్లు భావిస్తున్నారు. రైతుల పింఛన్‌పై సాధ్యాసాధ్యాలపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. రైతులకు రూ.2వేలు ఇచ్చే పనిలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. 47 ఏళ్లు నిండిన చిన్న, సన్నకారు రైతులకు పింఛన్‌ ఇచ్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు.  


ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా రైతులకు "రైతుబంధు"ను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకంతో చాలావరకు రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. రైతులకు పెట్టుబడి అందించే పేరుతో సంవత్సరానికి రెండు సార్లు అనగా వానాకాలం, యాసంగి పంటల సమయంలో  రైతుబంధును అందిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ‘రైతుబంధు ద్వారా 64 లక్షల మంది రైతులకు నాలుగేళ్లలో రూ.50 వేల కోట్లు అందించారు.  

రైతులు చనిపోతే వారి కుటుంబాలను ఆదుకోవడానికి  రైతు బీమాను ప్రవేశ పెట్టారు. ఈ పథకం ద్వారా రూ.3,205 కోట్ల ప్రీమియం చెల్లించారు. రాష్ట్రం ఏర్పడ్డాక వ్యవసాయం, దాని అనుబంధ విభాగాల్లో  రైతు సంక్షేమం కోసం రూ.2.71 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. అప్పులలో కూరుకుపోయిన రైతులను అదుకోవడానికి రెండుసార్లు రైతులకు రుణమాఫీ చేశారు. దాదాపు లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగింది. 

Updated Date - 2022-01-12T22:20:53+05:30 IST