కేసీఆర్కు మోసం చేయడమే తెలుసు:షర్మిల
ABN , First Publish Date - 2022-09-29T08:52:36+05:30 IST
అన్ని వర్గాలను మోసం చేయడం ఒక్కటే సీఎం కేసీఆర్కు తెలుసని, రాష్ట్రాన్ని దరిద్రం పాలు చేసింది చాలదన్నట్లు ఆయన దేశం మీద పడ్డారని వైఎ్సఆర్టీపీ అధినేత్రి షర్మిల విమర్శించారు.
మెదక్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): అన్ని వర్గాలను మోసం చేయడం ఒక్కటే సీఎం కేసీఆర్కు తెలుసని, రాష్ట్రాన్ని దరిద్రం పాలు చేసింది చాలదన్నట్లు ఆయన దేశం మీద పడ్డారని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల విమర్శించారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన కేసీఆర్ దేశాన్ని ఏం ఉద్ధరిస్తారని ప్రశ్నించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్ బస్టాండు సమీపంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. కేసీఆర్ తన ఎనిమిదేళ్ల పాలనలో ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్, బస్సు చార్జీలు విపరీతంగా పెరిగాయని చెప్పారు. సీఎం అంటే వైఎస్సార్ లాగా ఉండాలని, ఎన్నో పథకాలను అమలు చేసిన వైఎస్సార్ ప్రతీ పథకంలో కనిపిస్తారని చెప్పారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి నియోజకవర్గంలో భూ కబ్జాలు, ఇసుక అక్రమ వ్యాపారాలే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.