KCR సర్కార్ అలసత్వంతో రైతన్న కష్టం నీటి పాలు: విజయశాంతి
ABN , First Publish Date - 2022-05-06T23:28:50+05:30 IST
KCR సర్కార్ అలసత్వంతో రైతన్న కష్టం నీటి పాలు: విజయశాంతి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుపై BJP నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) ఆగ్రహం వ్యక్తం చేశారు. KCR సర్కార్ అలసత్వం వల్ల రైతన్న కష్టం నీటి పాలైందని, ప్రభుత్వం సరైన సమయానికి వడ్ల కాంటా పెట్టాకపోవడంతో అన్నదాత ఆరుగాలం పండించిన పంట తడిసి ముద్దయిందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షంతో సెంటర్లలో ఆరబోసిన ధాన్యం కుప్పలు తడిసిపోయాయని, చాలాచోట్ల వడ్లు నీటిలో కొట్టుకుపోయాయని విజయశాంతి తెలిపారు. కొన్ని చోట్ల కుప్పలు సైతం నీళ్లలో తేలియాడాయని, ఈ అకాల వర్షం చూసి రైతన్నలు కంటతడి పెట్టుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాములమ్మ సోషల్ మీడియాలో పోస్టు యథాతథంగా..
''కేసీఆర్ సర్కార్ అలసత్వం వల్ల రైతన్న కష్టం నీటి పాలైంది. ప్రభుత్వం సరైన సమయానికి వడ్ల కాంటా పెట్టాకపోవడంతో అన్నదాత ఆరుగాలం పండించిన పంట తడిసి ముద్దయింది. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షంతో సెంటర్లలో ఆరబోసిన ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. చాలాచోట్ల వడ్లు నీటిలో కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల కుప్పలు సైతం నీళ్లలో తేలియాడాయి. ఈ అకాల వర్షం చూసి రైతన్నలు కంటతడి పెట్టుకున్నరు. సెంటర్లలో కొట్టుకపోయిన వడ్లను కుప్పపోయడానికి, కల్లాల్లో నిలిచిన నీళ్లను ఎత్తిపోయడానికి నానా తిప్పలు పడ్డరు. కేసీఆర్ సర్కారు టైంకు వడ్లు కొనకపోవడం వల్లే తమ రెక్కల కష్టం నీటిపాలైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సెంటర్లన్నీ తెరిచి, కాంటాలు పెట్టి, ఎలాంటి కొర్రీలు లేకుండా తడిసిన ధాన్యం కొనాలని రైతన్నలు వేడుకున్నరు. ఇది నిజంగా బాధాకారం. కేసీఆర్... ఫామ్ హౌస్లో ఉండేందుకు నీకు ప్రజలు అధికారం ఇవ్వలే... కేంద్రంపై ఆరోపణలు ఆపి, ముందు రైతుల నుంచి వడ్లు కొను. ఇప్పటికే చాలా మంది రైతులు నష్టానికి వడ్లను అమ్ముకున్నరు. అకాల వర్షాలకు వడ్లు తడిసిపోయినయ్. ఆ వడ్లను మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనాలె. నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. తప్పించుకోవాలని కేసీఆర్ ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రతి రైతు నుంచి ఆఖరి గింజ వరకు ప్రభుత్వమే కొనాలి. దాటవేసేందుకు ప్రయత్నిస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అన్నదాతలను అరిగోసలు పెడుతున్న కేసీఆర్ సర్కార్కు ఈ రైతన్నలే తగిన బుద్ధి చెప్పడం ఖాయం.'' అని విజయశాంతి అన్నారు.