కేసీఆర్ త్వరగా కోలుకోవాలి: బండి సంజయ్

ABN , First Publish Date - 2022-03-12T02:24:12+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారని తెలిసిందని, కేసీఆర్

కేసీఆర్ త్వరగా కోలుకోవాలి: బండి సంజయ్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారని తెలిసిందని, కేసీఆర్ త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర నాయకత్వానికి, మోదీ, అమిత్ షా, నడ్డాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు అండగా నిలిచిన పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జాతీయ నాయకత్వం ఇచ్చిన కార్యక్రమాలతో పాటు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం నిర్వహించామన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటాన్ని గర్వంగా ఫీలవుతున్నానన్నారు. 


ఒక సామాన్య కార్యకర్తనైన తనను జాతీయ నాయకత్వం గుర్తించి బాధ్యతలు అప్పగించిందన్నారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే విధంగా పని చేశామన్నారు. అధికారంలోకి వచ్చేందుకు సమయం దగ్గరలోనే ఉందని ఆయన పేర్కొన్నారు. దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించామన్నారు. సీఎం కేసీఆర్ సెంటిమెంట్ రెచ్చగొడుతూ కేంద్రాన్నీ అప్రతిష్టపాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. స్ట్రాటజీ జిమ్మిక్కులకు టీఆర్‌ఎస్ పాల్పడుతున్నా.. విఫలమవుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. ఇదే చివరి పోరాటం కావాలని ఆయన పేర్కొన్నారు. 


ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజలు ఏమీ కోరుకుంటున్నారో తెలుసుకున్నామన్నారు. ఉచిత విద్య, వైద్యం అందిస్తామని స్పష్టం చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో ఒంటరిగా పోరాటం చేస్తామని, విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాల కాలవ్యవధిలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కేంద్ర నాయకత్వం సహకరించిందన్నారు.  

Updated Date - 2022-03-12T02:24:12+05:30 IST