డ్రైవర్ కం ఓనర్ల అద్దె కార్లకు చార్జీలు ఇవ్వని KCR ప్రభుత్వం...
ABN , First Publish Date - 2022-07-09T01:27:25+05:30 IST
కేసీఆర్ (KCR) పాలనలో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నేత విజయశాంతి (Vijaya Shanthi) తెలిపారు.
హైదరాబాద్: కేసీఆర్ (KCR) పాలనలో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నేత విజయశాంతి (Vijaya Shanthi) తెలిపారు. టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను రాములమ్మ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా (Social media) వేదికగా తప్పుబడుతూ ఉంటారు. ‘‘తాజాగా డ్రైవర్ కం ఓనర్ల అద్దె కార్లకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులివ్వడం లేదు. నెలల తరబడి చార్జీ డబ్బులు పెండింగ్లో ఉన్నా... అస్సలు వారిని పట్టించుకోవట్లేదు, దాదాపు అన్ని డిపార్ట్మెంట్స్లో ఇదే పరిస్థితి. యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ స్కీంను అది నుంచే కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోంది సుమారు 10వేల మంది డ్రైవర్లు... ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.30 కోట్ల కోసం ఎదురుచూస్తున్నరు. మంత్రులు, ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా వారు పట్టించుకున్న పాపాన పోలేదు. దాంతో వారి అవసరాలకి చేతిలో డబ్బుల్లేక కుటుంబం గడవడం కష్టంగా మారిందని వాపోతున్నరు. 2017 తర్వాత మంత్లీ చార్జీ పెంచకపోవడంతో గిట్టుబాటు కావడం లేదంటున్నరు’’ అని విజయశాంతి తెలిపారు.
‘‘గవర్నమెంట్ ఆఫీసర్ల కోసం అద్దె వెహికిల్కు జిల్లాల్లో అయితే నెలకు రూ.33 వేలు, హైదరాబాద్లో రూ.34 వేలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులు నెల రోజుల వరకు 2,500 కిలోమీటర్లు తిప్పుకోవచ్చు. అంతకంటే ఎక్కువ తిరగడానికి వీల్లేదు. ఇలా తిరిగిన దానికి ప్రతీ నెలా హైర్ చార్జీలు చెల్లించాలి. కానీ చాలా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో నెలలు గడుస్తున్నా డ్రైవర్లకు అద్దె చార్జీలు మాత్రం ఇవ్వడం లేదు. కొన్ని డిపార్ట్మెంట్స్లో ఏకంగా ఏడాది దాటినా పైసలు పత్తా లేవు. కేసీఆర్... నువ్వు చేప్పే బంగారు తెలంగాణ అంటే ఇదేనా? ఏదో ఉపాధి లభిస్తుందని అప్పో సప్పో చేసి కార్లు కొంటే... వారికి ఇప్పడు నెల గడవడమే కష్టంగా మారింది. దీనికేం సమాధానం చెబుతావు కేసీఆర్? ఇప్పటికైన మొండి వైఖరి పక్కన పెట్టి వారికి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించు. కేసీఆర్ సర్కార్ చేసే అనాలోచిత నిర్ణయాలను తెలంగాణ సమాజం చూస్తునే ఉంది.... త్వరలోనే సారును, కారును షెడ్కు పంపించడం ఖాయం’’ అని విజయశాంతి హెచ్చరించారు.