కేసీఆర్ సంగతి తేల్చేస్తాం: బండి సంజయ్
ABN , First Publish Date - 2022-07-02T09:37:58+05:30 IST
సీఎం కేసీఆర్ సంగతి తేల్చేందుకే హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు.
హైదరాబాద్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్ సంగతి తేల్చేందుకే హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. హెచ్ఐసీసీలో సంజయ్ శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ అవినీతి చిట్టాను త్వరలోనే విప్పుతామన్నారు. ‘‘తెలంగాణ పాకిస్థాన్లో ఉందా? అఫ్ఘానిస్థాన్లో ఉందా? ఇక్కడ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఎందుకు పెడుతున్నారని అడుగుతున్నారు. సమావేశాలు పెట్టాలంటే మీ అనుమతి తీసుకోవాలా?’’ అని ధ్వజమొత్తారు. హైదరాబాద్లో ఎక్కడ చూసినా సీఎం, ఆయన కొడుకు ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలే కనిపిస్తుంటే మంత్రులకు సిగ్గుగా లేదా? అని అన్నారు. బీజేపీ ఎనిమిదేళ్లుగా ఏం చేయలేదని చెబుతున్న సీఎం కేసీఆర్.. ప్రధానిని కలిసి దండాలు ఎందుకు పెట్టారని ఆయన ప్రశ్నించారు.