సర్వే అధికారిగా ఆయన్నే ఉంచండి
ABN , First Publish Date - 2022-05-19T07:57:33+05:30 IST
జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రఫీ సర్వేకు నేతృత్వం వహించిన చీఫ్ అడ్వొకేట్ కమిషనర్ అజయ్ మిశ్రా ద్వారానే సర్వే నివేదికను సమర్పించేందుకు అనుమతించాలని వారాణసీ కోర్టులో పిటిషనర్లు అభ్యర్థించారు.
‘జ్ఞానవాపి’ కేసులో పిటిషనర్ల అభ్యర్థన
నేడు వారాణసీ కోర్టుకు సర్వే నివేదిక
‘సుప్రీం’లోనూ కొనసాగనున్న విచారణఆ
సర్వే నివేదికను ఒప్పుకోం: ఒవైసీ
ప్రజల్ని రెచ్చగొట్టొద్దు: ఆర్ఎస్ఎస్
న్యూఢిల్లీ/వారాణసీ మే 18: జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రఫీ సర్వేకు నేతృత్వం వహించిన చీఫ్ అడ్వొకేట్ కమిషనర్ అజయ్ మిశ్రా ద్వారానే సర్వే నివేదికను సమర్పించేందుకు అనుమతించాలని వారాణసీ కోర్టులో పిటిషనర్లు అభ్యర్థించారు. సర్వే నివేదికను కోర్టుకు సమర్పించక ముందే ఆ వివరాలు మీడియాకు లీక్ అవుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు మంగళవారం అజయ్ మిశ్రాను ఆ బాధ్యతల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. అనంతరం చీఫ్ అడ్వొకేట్ కమిషనర్గా విశాల్ సింగ్ నియమితులయ్యారు. అలాగే సర్వే నివేదికను సమర్పించేందుకు గడువును గురువారం వరకు కోర్టు పొడిగించింది. మసీదులో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయని, అక్కడ పూజలు చేసేందుకు తమను అనుమతించాలని పిటిషన్ దాఖలు చేసిన ఐదుగురు మహిళలు.. చీఫ్ అడ్వొకేట్ కమిషనర్గా అజయ్ మిశ్రానే కొనసాగించాలని బుధవారం వారాణసీ కోర్టును కోరారు. అన్ని అప్లికేషన్లపైనా కోర్టు గురువారం విచారణ జరపనుంది. మరోవైపు సర్వేకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో గురువారం విచారణ కొనసాగనుంది. కాగా, వారాణసీ కోర్టుకు గురువారం సమర్పించే సర్వే నివేదికను అంగీకరించబోమని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఓ ఆంగ్ల టీవీ చానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. బావి(వజూఖానా)లో గుర్తించినది శివలింగం కాదని, అది ఫౌంటెయిన్ అన్నారు. ‘ఫౌంటెయిన్ను శివలింగం అంటున్నారు. రేపు తాజ్మహల్లోని ఫౌంటెయిన్లన్నింటినీ శివలింగాలు అంటారు. ఆ తర్వాత ఎక్కడ ఫౌంటెయిన్ కనిపించినా శివలింగమే అంటారు’ అని వ్యాఖ్యానించారు.