AAP Vs BJP : బీజేపీపై కేజ్రీవాల్ భీకర దాడి
ABN , First Publish Date - 2022-09-18T18:41:28+05:30 IST
అవినీతి ఆరోపణలు ముసురుకుంటున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్
న్యూఢిల్లీ : అవినీతి ఆరోపణలు ముసురుకుంటున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) బీజేపీపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. బీజేపీ రెండో దశ ఆపరేషన్ లోటస్ (Operation Lotus)ను ప్రారంభించిందని ఆరోపించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చేయాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. ఆ పార్టీ పంజాబ్, ఢిల్లీల్లో చేసిన ప్రయత్నాలు దయనీయంగా విఫలమయ్యాయన్నారు. ఇప్పుడు సరికొత్త ప్రయత్నాలను ప్రారంభించిందన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ మొదటి జాతీయ సమావేశంలో మాట్లాడుతూ, బీజేపీ (BJP) రెండో దశ ఆపరేషన్ లోటస్ను ప్రారంభించిందన్నారు. పంజాబ్, ఢిల్లీల్లో చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో, ఇప్పుడు సరికొత్తగా ప్రయత్నాలు చేస్తోందన్నారు.
ఢిల్లీ ఎక్సయిజ్ విధానం (Delhi Excise Policy)లో అక్రమాలపై సీబీఐ, ఈడీ సోదాలు, కేసుల దర్యాప్తు; ఓ అవినీతి కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ను నాలుగు రోజులపాటు పోలీస్ కస్టడీకి ఆదేశించడం వంటి పరిణామాల నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘వాళ్ళు (బీజేపీ) మనీశ్ సిసోడియా వెంటబడ్డారు, ఇప్పుడు అమానతుల్లాను అరెస్టు చేశారు. ఆ తర్వాత కైలాశ్ గెహ్లాట్ (ఢిల్లీ రవాణా మంత్రి)ని టార్గెట్ చేస్తారు’’ అని కేజ్రీవాల్ ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగపరుస్తోందని ఆరోపించారు.
భారత దేశ రాజ్యాంగాన్ని కాపాడటానికే ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడిందని చెప్పారు. ఆ పార్టీ 2012 నవంబరు 26న ఏర్పాటైన సంగతి తెలిసిందే.