రామ్లల్లా ఆలయంలో ప్రార్థనలు చేసిన కేజ్రీవాల్
ABN , First Publish Date - 2021-10-26T17:13:50+05:30 IST
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఉదయం ఉత్తరప్రదేశ్లోని అయోధ్యను..
అయోధ్య: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఉదయం ఉత్తరప్రదేశ్లోని అయోధ్యను సందర్శించారు. రామజన్మభూమి వద్ద రామ్లల్లాకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బుధవారంనాడు ఢిల్లీలో ప్రత్యేక క్యాబినెట్ సమావేశం జరుపుతున్నామని, ఢిల్లీలోని సీనియర్ సిటిజన్లకు ప్రకటించిన ఉచిత యాత్రా స్కీమ్లో అయోధ్య ప్రాంతాన్ని చేరుస్తామని చెప్పారు.
దేశవ్యాప్తంగా నవంబర్ 3-4 తేదీల్లో దీపావళి వేడుకలు జరుపుకోనున్న నేపథ్యంలో కేజ్రీవాల్ అయోధ్య పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. 2022లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ఆప్ సైతం ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలతో తలబడుతోంది. కాగా, రావణాసుర సంహారం అనంతరం రాముడు తన భార్య సీత, సోదరుడు లక్ష్మణుడు, హనుమంతునితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజుగా దీపావళిని ఉత్తర భారతదేశ ప్రజలు జరుపుకొంటారు.