Kerala: పదో తరగతి పాస్ అయినందుకు తనను తానే అభినందించుకుంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన విద్యార్థి.. ఫొటో వైరల్
ABN , First Publish Date - 2022-06-30T01:39:09+05:30 IST
సాధారణంగా తమ విద్యార్థులు పదో తరగతిలో సాధించిన మార్కులను తెలుపుతూ విద్యా సంస్థలు ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేస్తుంటాయి.
సాధారణంగా తమ విద్యార్థులు పదో తరగతిలో సాధించిన మార్కులను తెలుపుతూ విద్యా సంస్థలు ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేస్తుంటాయి. అయితే కేరళకు చెందిన ఓ విద్యార్థి మాత్రం పదో తరగతి పాస్ అయినందుకు తనను తానే అభినందించుకుంటూ ఇంటి దగ్గర ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్నాడు. తన ఉత్తీర్ణత గురించి బంధువులు, స్నేహితులు, గ్రామస్తులే కాకుండా రాష్ట్రమంతటా మాట్లాడుకునేలా చేశాడు. చివరకు ఆ ఫ్లెక్సీ కేరళ రాష్ట్ర విద్యా మంత్రి వరకు వెళ్లింది.
ఇది కూడా చదవండి..
Happy Birthday Chor: దొంగతనం చేస్తూ పట్టుబడిన వ్యక్తికి షాకింగ్ సర్ప్రైజ్.. అతడి చేత కేక్ కట్ చేయించి..
కేరళలోని పతనంతిట్టా గ్రామానికి చెందిన జిష్ణు అనే విద్యార్థి 2022 ఎస్ఎస్ఎల్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. ఆ విషయాన్ని తెలియజేస్తూ.. `2022 ఎస్ఎస్ఎల్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినందుకు నన్ను నేను అభినందించుకుంటున్నాను. కథ ఇకపై ప్రారంభమవుతుంది` అని రాసుకుని పక్కన తన ఫొటో వేయించుకున్నాడు. అలాగే `చరిత్ర కొంతమందికి దారి ఇస్తుంద`ని ఓ కొటేషన్ కూడా రాయించాడు. ఆ ఫ్లెక్సీ కేరళ రాష్ట్రంలో బాగా వైరల్ అయింది.
రోజూ కూలీగా పని చేసే తల్లిదండ్రులు, కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేని ఇంట్లో ఉండి జిష్ణు పదో తరగతి పాసయ్యాడు. కేరళ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శివన్ కుట్టి దృష్టిని కూడా జిష్ణు ఫ్లెక్సీ బోర్డు ఆకర్షించింది. `చరిత్ర కొంత మందికి దారి ఇస్తుందని జిష్ణు తన ఫ్లెక్సీలో రాసుకున్నాడు. అతడు జీవితంలో కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నా. అతను జీవిత పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించాలని ఆశిస్తున్నాన`ని మంత్రి పేర్కొన్నారు.