ట్యాంకర్ లారీ డ్రైవర్గా కేరళ యువతి రికార్డు!
ABN , First Publish Date - 2021-12-05T17:30:14+05:30 IST
కేరళలో హెవీ వెహికిల్ను నడిపే రెండో మహిళగా
పాలక్కాడ్ : కేరళలో హెవీ వెహికిల్ను నడిపే రెండో మహిళగా బర్కత్ నిషా (25) రికార్డు సృష్టించబోతున్నారు. మోటారు వాహనాలపై ఆమెకు విపరీతమైన ఆసక్తి ఉంది. దీంతో ఆమె భారీ వాహనాలను నడపటంలో శిక్షణ పొందారు. ఆమెకు ఇప్పటికే హజార్డస్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది. చలిసేరి పోలీస్ స్టేషన్ నుంచి క్లియరెన్స్ పాస్ రావలసి ఉంది. ఈ పాస్ లభిస్తే ఆమె పెట్రోలియం ఉత్పత్తులను రవాణా చేసే ట్యాంకర్ లారీలను నడపవచ్చు. కేరళలో భారీ వాహనాలను నడిపే తొలి మహిళగా డెలిషా డేవిస్ రికార్డు సృష్టించారు. ఆమె త్రిసూర్లోని కండస్సంకడవు ప్రాంతానికి చెందినవారు.
కేరళలోని నాగలసేరి పంచాయతీ, కిలివలంకున్ను గ్రామస్థురాలు బర్కత్ నిషా మీడియాతో మాట్లాడుతూ, పెట్రోలియం ఉత్పత్తుల లోడింగ్, రవాణాకు అనుమతి పొందడం కోసం చలిసేరి పోలీస్ స్టేషన్ నుంచి క్లియరెన్స్ పాస్ అవసరమని, ఈ పాస్ తనకు వచ్చిన తర్వాత తాను దానిని కొచ్చిలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీకి పంపిస్తానని చెప్పారు.
తన 14వ ఏట తన అన్నయ్య బైక్ను తాను నడిపానని చెప్పారు. అంత కన్నా చిన్న వయసులోనే తాను వాహనానికి స్టాండ్ వేయడం, స్టార్ట్ చేయడం వంటివాటికి ప్రయత్నించినట్లు తెలిపారు. బైక్, ఆటో, కారు, లారీ వంటివాటిని నడపడానికి వచ్చే అవకాశాలను తాను వదులుకోలేదన్నారు. ప్రమాదకర పదార్థాలను రవాణా చేయడానికి ఈ ఏడాది నవంబరు 10న తనకు, తన తమ్ముడికి లైసెన్స్ వచ్చిందన్నారు. తాము ఎర్నాకుళంలో శిక్షణ పొందినట్లు తెలిపారు.
ప్రస్తుతం తాను తన తమ్ముడితో కలిసి టారస్ లారీలను తక్కువ దూరాలకు నడుపుతున్నానని చెప్పారు. ట్యాంకర్ లారీలను నడపాలనేది తన లక్ష్యమని, త్వరలోనే నేషనల్ హైవే పైకి రెగ్యులర్ డ్రైవర్గా వస్తానని చెప్పారు.