Kesineni Nani: నేను టీడీపీలో అసంతృప్తిగా లేను..
ABN , First Publish Date - 2022-08-15T16:00:37+05:30 IST
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం కేశినేని భవన్లో వేడుకలు ఘనంగా జరిగాయి.
విజయవాడ (Vijayawada): స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా సోమవారం ఉదయం కేశినేని (Kesineni Nani) భవన్లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని పాల్గొని కార్యాలయం వద్ద జాతీయ జెండాను (National Flag) ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం రాకముందు మన దేశం దీనస్థితిలో ఉందన్నారు. కోహినూర్ వజ్రంతో సహా అన్ని బ్రిటిషర్స్ తీసుకుపోయారన్నారు. ఇప్పుడు భారత్ అన్నివిధాలా అభివృద్ధి చెందిందని, వైద్యానికి ఇండియా ప్రపంచానికే ఒక మైలు రాయిలా మారిందన్నారు. ప్రపంచానికి మొదటగా కోవిడ్ వాక్సిన్ ఇచ్చామని అన్నారు.
ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం, ప్రైవేట్ వ్యవహారం కాదని, మహిళలకి సంబంధించిన విషయమని కేశినేని నాని అన్నారు. రాజకీయ నాయకులు చాలా నిస్వార్థంగా పని చెయ్యాలని సూచించారు. తాను టీడీపీలో అసంతృప్తిగాలేనని తెలిపారు. మీడియా తనపై పోకస్ చేయొద్దని కోరారు. తాను ఎంపీగా ఉన్నా.. లేకపోయిన విజయవాడకు నష్టమేమీ లేదన్నారు. తనలాంటి నానిలు లక్ష మంది పుట్టుకొస్తారన్నారు. తన కార్లపై ఎక్కడైనా ఎంపీ స్టిక్కర్ కనపడిందా... ఊరుకోనన్నారు. తన కారుకు మాత్రమే ఎంపీ స్టిక్కర్ ఉంటుందని, ఆ కారులో తన కుమార్తెను కూడా తిరగనివ్వనని కేశినేని నాని స్పష్టం చేశారు.