Partha Chatterjee: ఆమె ఇంట్లో రూ.21 కోట్ల నోట్ల కట్టలు.. ఆయన ఇంట్లో ఏం దొరికాయంటే..

ABN , First Publish Date - 2022-07-26T21:20:59+05:30 IST

పశ్చిమబెంగాల్‌ పాఠశాల ఉద్యోగాల కుంభకోణంలో (SSC Scam) ఆ రాష్ట్ర పారిశ్రామిక మంత్రి, టీఎంసీ సెక్రటరీ జనరల్‌ పార్థా చటర్జీని (Partha Chatterjee) అరెస్ట్ చేసిన..

Partha Chatterjee: ఆమె ఇంట్లో రూ.21 కోట్ల నోట్ల కట్టలు.. ఆయన ఇంట్లో ఏం దొరికాయంటే..

కోల్‌కత్తా: పశ్చిమబెంగాల్‌ పాఠశాల ఉద్యోగాల కుంభకోణంలో (SSC Scam) ఆ రాష్ట్ర పారిశ్రామిక మంత్రి, టీఎంసీ సెక్రటరీ జనరల్‌ పార్థా చటర్జీని (Partha Chatterjee) అరెస్ట్ చేసిన ఈడీ (ED) కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది. ఆయన ఇంట్లో ఈ కుంభ కోణానికి సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లు లభ్యమైనట్లు తెలిసింది. ప్రాథమిక పాఠశాలల్లో టీచర్ పోస్టుల (Teacher Posts) కోసం ఆశావహులుగా ఉన్న 48 మంది అభ్యర్థుల జాబితా రోల్ నంబర్లతో సహా పార్థా ఛటర్జీ ఇంట్లో (Partha Chatterjee House) లభ్యమైనట్లు కోర్టుకు ఈడీ వెల్లడించింది. రిక్రూట్‌మెంట్ టెస్ట్ కోసం అడ్మిట్ కార్డులు, గ్రూప్-డీ (Group D) సిబ్బంది నియామకానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఆయన ఇంట్లో లభ్యమైనట్లు న్యాయస్థానానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తెలిపింది. ఇదిలా ఉండగా.. ఈ కేసులో తాజాగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పార్థా ఛటర్జీ అరెస్ట్ అయిన తర్వాత టీఎంసీ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి (Mamata Banerjee) మూడు సార్లు కాల్ చేసినట్లు తెలిసింది. నాలుగోసారి కాల్ చేసినప్పటికీ పార్థా ఛటర్జీ నంబర్‌ను మమత బ్లాక్ చేసినట్లు సమాచారం.



ప్రోటోకాల్ (Protocol) ప్రకారం.. ఎవరైనా ఒక వ్యక్తి అరెస్ట్ అయితే అతను తన కుటుంబ సభ్యుల్లో గానీ, స్నేహితుల్లో గానీ, బంధువుల్లో గానీ ఒకరికి మాత్రమే తన అరెస్ట్‌పై సమాచారం అందించాలి. కానీ.. పార్థా ఛటర్జీ మమతకు మూడు సార్లు కాల్ చేసినట్లు తెలిసింది. మూడు సార్లు ఫోన్ చేసినప్పటికీ మమత కాల్ లిఫ్ట్ చేయలేదని సమచారం. నాలుగో సారి పార్థా ఛటర్జీ కాల్ చేయగా ఆమె అతని నంబర్‌ను బ్లాక్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా ఈ కేసులో పార్థా ఛటర్జీని, ఆయన సహాయకురాలు అర్పిత ముఖర్జీని (Arpita Mukherjee) ఈడీ మంగళవారం విచారించింది. తన ఇంట్లో పట్టుబడిన డబ్బంతా మంత్రి పార్థా ఛటర్జీకి సంబంధించిందేనని అర్పిత ముఖర్జీ విచారణలో ఒప్పుకున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్పష్టం చేసింది. కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ఈ పాఠశాల ఉద్యోగాల కుంభకోణానికి సంబంధించి టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లేఖ రాశారు. మంత్రివర్గం నుంచి తక్షణమే పార్థా ఛటర్జీని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.



పశ్చిమబెంగాల్‌ పాఠశాల ఉద్యోగాల కుంభకోణంలో ఆ రాష్ట్ర పారిశ్రామిక మంత్రి, టీఎంసీ సెక్రటరీ జనరల్‌ పార్థా చటర్జీ అరెస్టయ్యారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఆయన్ను శనివారం అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. 2014-2021 వరకు పార్థా చటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలోనే విద్యాశాఖలో ఈ కుంభకోణం వెలుగుచూసింది. ఈ కేసుకు సంబంధించి ఆయన్ను ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి 26 గంటలపాటు ప్రశ్నించారు. అరెస్టు తర్వాత ఆయన్ను ఆస్పత్రికి తరలించి ఆరోగ్య పరీక్షలు చేయించారు. తాను సీఎం మమతా బెనర్జీని సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆమె అందుబాటులోకి రాలేదని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చటర్జీ చెప్పారు. కాగా పార్థా చటర్జీకి సన్నిహితురాలైన ఆర్పితా ముఖర్జీ ఇంట్లో రూ.21 కోట్ల నగదు దొరకడంతో ఆమెనూ ఈడీ అదుపులోకి తీసుకుంది. పార్థా చటర్జీ అరెస్టుపై అధికార టీఎంసీ ఆచితూచి స్పందించింది. పరిస్థితిని గమనిస్తున్నామని, సరైన సమయంలో ఓ ప్రకటన చేస్తామని టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్‌ ఘోష్‌ చెప్పారు. కాగా పార్థా చటర్జీని అరెస్టు చేసిన తీరును అసెంబ్లీ స్పీకర్‌ బిమాన్‌ బెనర్జీ తప్పుబట్టారు. ఛటర్జీ అరెస్టు చేసే ముందు తనకు ఈడీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వెల్లడించారు.

Updated Date - 2022-07-26T21:20:59+05:30 IST