సాయిగణేష్ ఆత్మహత్యపై బీజేపీ అధిష్ఠానం ఆరా
ABN , First Publish Date - 2022-04-19T21:09:46+05:30 IST
సాయిగణేష్ ఆత్మహత్యపై బీజేపీ అధిష్ఠానం ఆరా తీసింది.
న్యూఢిల్లీ: బీజేపీ అనుబంధ మజ్దూర్ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు సాయిగణేష్ ఆత్మహత్యపై బీజేపీ అధిష్ఠానం ఆరా తీసింది. బుధవారం కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఖమ్మం రానున్నారు. ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయిగణేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇప్పటికే సాయిగణేష్ కుటుంబాన్ని కేంద్రమంత్రి అమిత్ షా ఫోన్లో పరామర్శించారు. కాగా ఆత్మహత్యలపై రేపు బీజేపీ బృందం గవర్నర్ తమిళిసైను కలవనున్నారు. ఆత్మహత్య ఘటనలు పునరావృతం కాకుండా కాపాడాలని కోరనున్నారు. అలాగే ఖమ్మంలో బీజేపీ లీగల్ సెల్ పర్యటించనుంది. న్యాయపోరాటం చేయాలని నిర్ణయించింది.
కాగా సాయిగణేష్ ఆత్మహత్యపై సిట్టింగ్ జడ్జితో లేదా జ్యుడీషియల్ విచారణ అయినా జరిపించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ కిసాన్మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సన్నె ఉదయ్ప్రతాప్ తదితరులు సోమవారం ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్ను కలిశారు. సాయిగణేష్ బలవన్మరణానికి మంత్రి పువ్వాడ అజయ్కుమార్, కార్పొరేటర్ భర్త ప్రసన్న కృష్ణ, పోలీసుల వేధింపులే కారణమని వారు ఆరోపించారు. గణేష్ చనిపోయేముందు మీడియాకు చెప్పిన మాటలను మరణవాంగ్మూలంగా పరిగణించి వారిపై కేసులు నమోదు చేయాలని కోరారు. అనంతరం ఆ నాయకులు మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకుల ఒత్తిడితో పోలీసులు గణేష్పై దాదాపు 15 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.