అక్కడ పురుష సమానత్వం కోసం పోరాటం... స్త్రీ ఆధిపత్యంపై నిరసనలు... ఆస్తిపై ఆడవారికే పూర్తి హక్కు!

ABN , First Publish Date - 2022-08-01T15:08:53+05:30 IST

అనేక మతాలు, కులాలు, వర్గాల ప్రజలు...

అక్కడ పురుష సమానత్వం కోసం పోరాటం... స్త్రీ ఆధిపత్యంపై నిరసనలు... ఆస్తిపై ఆడవారికే పూర్తి హక్కు!

అనేక మతాలు, కులాలు, వర్గాల ప్రజలు భారతదేశంలో నివసిస్తున్నారు. ఇక్కడి ఆచారాలు భిన్నంగా ఉంటాయి. అయితే అన్ని మతాల ప్రజలలో ఒక సారూప్యత కనిపిస్తుంది అదే వధువుకు వీడ్కోలు పలకడం. భారతదేశం మొదటి నుండి పురుషాధిక్య దేశంగా ఉంది. వివాహానంతరం వధువుకు వీడ్కోలు పలికే ఆచారం పురాతన కాలం నుండి కొనసాగుతోంది. అయితే భారతదేశంలోని ఆ ప్రాంతంలో స్త్రీ ఆధిపత్యం కలిగిన తెగ ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ పెళ్లయ్యాక వరుడు.. వధువు ఇంటికి వెళతాడు. మేఘాలయలోని ఖాసీ తెగలో ఈ ఆచారం కొనసాగుతోంది. ఈ తెగలో కుటుంబ సభ్యుల బాధ్యత మహిళపైనే ఉంటుంది. ఇది ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది నిజం. 


ఈ ఆచారం భారతదేశంలోని మిగిలిన ఆచారాలకు భిన్నంగా ఉంటుంది. ఈ సమాజంలో ఇంటిలోని ఆడవారే నిర్ణయాలు తీసుకుంటారు. మార్కెట్‌లు, షాపుల్లో మహిళలు మాత్రమే పనిచేస్తుంటారు. పిల్లలకు వారి పేరు తర్వాత తల్లి పేరు వస్తుంది. తల్లి తర్వాత కుటుంబానికి సంబంధించిన ఆస్తిని ఇక్కడ కూతుళ్లకు ఇస్తుంటారు. కుటుంబంలో చిన్న కుమార్తెపై అధిక బాధ్యతలుంటాయి. ఆమె తన తల్లిదండ్రులను, పెళ్లికాని తోబుట్టువులను, ఆస్తులను కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఆమెనే ఇంటి ఆస్తికి యజమాని. విశేషమేమిటంటే ఈ ప్రాంతంలో కూతురు పుట్టినందుకు చాలా ఆనందిస్తారు. పెళ్లి విషయంలో జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి అబ్బాయికి, అమ్మాయికి పూర్తి స్వేచ్ఛ ఇస్తారు. ఈ ఖాసీ సంఘంలో ఎలాంటి వరకట్న విధానం లేదు. వరకట్న వ్యవస్ధకు ఈ వర్గాల ప్రజలు పూర్తిగా వ్యతిరేకం. గత కొన్నేళ్లుగా ఇక్కడి మగవాళ్లు సమానత్వం కావాలని పోరాడుతున్నారు. ఈ తెగలో స్త్రీల ఆధిపత్యం ఉన్నప్పటికీ రాజకీయాల్లో మహిళల ఉనికి చాలా తక్కువ. దర్బార్ల పేరిట నిర్వహించే సమావేశాలకు మహిళలు హాజరుకారు. మగవారు మాత్రమే హాజరవుతారు. అక్కడ వారు రాజకీయ సంబంధిత సమస్యలను చర్చించి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. మేఘాలయతో పాటు, అస్సాం, మణిపూర్, పశ్చిమ బెంగాల్‌లో కూడా ఖాసీ కమ్యూనిటీ ప్రజలు నివసిస్తున్నారు. 



Updated Date - 2022-08-01T15:08:53+05:30 IST