Aryan Khan కేసులో ఎన్సీబీ సాక్షి కిరణ్ గోసావి అరెస్ట్
ABN , First Publish Date - 2021-10-28T13:56:32+05:30 IST
ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ స్వతంత్ర సాక్షిగా ఉన్న కిరణ్ గోసావిని పూణే పోలీసులు అరెస్ట్ చేశారు....
పూణే: ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ స్వతంత్ర సాక్షిగా ఉన్న కిరణ్ గోసావిని పూణే పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ చీటింగ్ కేసుకు సంబంధించి కిరణ్ గోసావిని ప్రశ్నిస్తున్నట్లు పూణే పోలీసులు చెప్పారు. కిరణ్ సోమవారం లక్నోలో లొంగిపోతానని పేర్కొన్న మూడు రోజుల తర్వాత అతన్ని అరెస్టు చేశారు. అయితే పోలీసులు మాత్రం గోసావి లొంగిపోవడానికి అంగీకరించలేదు.ఈ నెల ప్రారంభంలో ఆర్యన్ ఖాన్ తోపాటు పలువురిని అరెస్టు చేయడానికి దారితీసిన క్రూయిజ్ షిప్పై ఎన్సీబీ దాడులు చేసింది. ఈ ఘటన తర్వాత గోసావి బాలీవుడ్ సూపర్స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్తో సెల్ఫీలో కనిపించాడు.
2018 చీటింగ్ కేసుకు సంబంధించి పూణే పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడంతో పరారీలో ఉన్న గోసావి...మహారాష్ట్రలో తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొన్నాడు. కిరణ్ గోసావి కేపీజీ డ్రీమ్స్ సొల్యూషన్స్ పేరుతో ఔత్సాహికులకు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించే కంపెనీ నడిపారు. మలేషియాలోని ఓ హోటల్ లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ గోసావి ఒకరి నుంచి రూ.3.09లక్సలు తీసుకొని మోసం చేశాడని పూణే పోలీసులు కేసు నమోదు చేశారు.