కేసీఆర్ యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారు: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-03-06T20:56:09+05:30 IST

సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు చేసిందేమీ లేదని... ఉద్యమానికి కేంద్ర బిందువులుగా ఉన్న యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారు: కిషన్‌రెడ్డి

వరంగల్: సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు చేసిందేమీ లేదని... ఉద్యమానికి కేంద్ర బిందువులుగా ఉన్న యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం హన్మకొండ ఎస్వీ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన సమావేశానికి బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రావు పద్మ, బీజేపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు.  ఈసందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..  తెలంగాణలో సీఎం కేసీఆర్, ఓవైసీ కుటుంబాలే బంగారు కుటుంబాలయ్యాయని విమర్శించారు. 2016లో రైల్వే ఓవరాలింగ్ పరిశ్రమను ఇచ్చాం.. కానీ 160ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతోనే ఆ ప్రాజెక్టు నిలిచిపోయిందన్నారు.


బీబీనగర్‌లో మెడికల్ కాలేజీ ప్రారంభమైనా... ప్రభుత్వం భూములను ఇవ్వలేదని చెప్పారు. వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం వాటా 30కోట్ల రూపాయలు చెల్లించలేదు. 6వేల కోట్లతో రామగుండంలో ఎరువుల పరిశ్రమ తెచ్చాం.. దానిని త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. కేసీఆర్ ప్రభుత్వం ఏ జిల్లాలోనూ ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించలేదు. బీజేపీకి పేరు వస్తుందని ఆయుస్మాన్ భారత్ పథకాన్ని ఇన్నాళ్లూ అడ్డుకుందని చెప్పారు. ఆరోగ్య శ్రీ పథకానికి కేసీఆర్ తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. 


టీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మొద్దు.. వరంగల్‌లో డ్రబుల్ బెడ్‌రూం ఇల్లు నిర్మిస్తామన్నారు అవి ఎక్కడికి పోయాయి..? అని ప్రశ్నించారు. పేదలంటే కేసీఆర్‌కు చులకన అని కిషన్‌రెడ్డి చెప్పారు.ఉద్యమకారులు రోడ్లపై ఉంటే ఉద్యమ ద్రోహులు ప్రగతి భవన్‌లో ఉన్నారన్నారు. ఎంఐఎం పార్టీతో చెట్టాపట్టాల్ వేసుకుని పాలన సాగిస్తున్నారన్నారు. దేశంలోనే సచివాలయానికి రాని ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు.  ప్రపంచంలో సచివాలయం లేని రాష్ట్రం మన బంగారు తెలంగాణ అన్నారు.  ముఖ్యమంత్రి సొంత ప్రాంతానికి ఇచ్చిన ప్రాధాన్యత ఇతర ప్రాంతాలకు ఇవ్వడం లేదని మండిపడ్డారు.


కేసీఆర్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శించే అర్హత లేదని.. జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, భూమాఫియా కొనసాగుతోందని.. చర్యలు తీసుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణకు చాలా కీలకమన్నారు. దుబ్బాకలో ప్రజలు టీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టారన్నారు. హైదరాబాద్‌లో బీజేపీ సత్తా చాటిందని చెప్పారు. ముఖ్యమంత్రి కుటుంబంపై తెలంగాణ సర్వత్రా వ్యతిరేకతతో ఉందన్నారు. మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు, అది బీజేపీతోనే సాధ్యమని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-06T20:56:09+05:30 IST