అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన Kishan Reddy
ABN , First Publish Date - 2022-06-02T17:15:25+05:30 IST
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన నివాసంలో జెండా ఆవిష్కరించారు. ఆవిష్కరించారు.
New Delhi: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (Telangana Formation Day) సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ( Kishan Reddy) తన నివాసంలో జెండా ఆవిష్కరించారు. అలాగే తెలంగాణ భవన్లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. అందులో భాగంగా అనేక రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవాలను కేంద్రం నిర్వహిస్తోందని చెప్పారు. కేంద్ర మంత్రులు స్వయంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నారు. ఈ మధ్యనే సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించామని, తెలంగాణ ఏర్పడి 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిపే ఈ వేడుకలు తెలంగాణ అమరవీరులకు అంకితమన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని, 168 మంది ఎంపీలు తెలంగాణ కోసం ఓటు వేశారని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో, మౌలిక వసతుల కల్పనలో కేంద్రం తోడ్పాటునందిస్తోందని, పూర్తి మద్ధతు కొనసాగుతుందని చెప్పారు. గురువారం సాయంత్రం 6.30 గంటలకు అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో తెలంగాణ అవతరణ దినోత్సవాలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారని, ఇతర కేంద్ర మంత్రులు, తెలుగు, తెలంగాణ ప్రజలు కూడా పాల్గొంటున్నారని తెలిపారు. తెలంగాణ కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉంటాయని, తెలంగాణ వంటకాలతో భోజనాలను కూడా ఏర్పాటు చేశామని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.