గోవాలో బీజేపీ గెలుపులో కిషన్ రెడ్డి పాత్ర కీలకం..

ABN , First Publish Date - 2022-03-11T00:43:00+05:30 IST

గోవాలో బీజేపీ సంఖ్యా బలం గతం కంటే మెరుగుపడడంలో కేంద్ర పర్యాటక శాఖామంత్రి కిషన్‌ రెడ్డి.. కృషి ఎంతో ఉంది. గోవా ఎన్నికల సహ ఇంచార్జి బాధ్యతలు తీసుకున్న ఆయన...

గోవాలో బీజేపీ గెలుపులో కిషన్ రెడ్డి పాత్ర కీలకం..

గోవా ఎన్నికల్లో బీజేపి గతం కంటే ఎక్కువ సీట్లు సొంతం చేసుకుని అధికారం చేపట్టనుంది. ఈ నేపథ్యంలో గోవా సీఎంగా ఎవరు ఎన్నికవుతారు అనే అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే, తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం సీఎంగా కొనసాగుతోన్న ప్రమోద్ సావంతే మరోసారి ముఖ్యమంత్రిగా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సావంత్.. సాంకెలిమ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదిలా వుండగా.. గోవాలో బీజేపీ సంఖ్యా బలం గతం కంటే మెరుగుపడడంలో కేంద్ర పర్యాటక శాఖామంత్రి కిషన్‌ రెడ్డి.. కృషి ఎంతో ఉంది. గోవా ఎన్నికల సహ ఇంచార్జి బాధ్యతలు తీసుకున్న ఆయన, లోతుగా విశ్లేషణ చేశారు. గ్రామ స్థాయి నుంచి రిపోర్టులు తెప్పించుకుని, అభ్యర్థుల ఎంపిక దగ్గర్నుంచి.. పోస్టర్ల డిజైనింగ్‌, ప్రచారం తదితర అంశాల్ని దగ్గరుండి చూసుకున్నారు.


దీనికితోడు పర్యాటక మంత్రిగా అక్కడ అనేక కార్యమాలు చేపట్టారు. దీంతో తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, వారిని చైతన్యం చేయడంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీల ఎత్తులకు పైఎత్తులు వేయడంలోనూ ముందున్నారు. గోవాలో క్రిస్టియానిటీ ఎక్కువగా ఉండడంతో.. ఆ ఓట్లను ఆకర్షించేలా చర్యలు తీసుకున్నారు. అసంతృప్తులను బుజ్జగించడం, ఓట్లు చీలకుండా అవసరమైన వారికి టికెట్లు ఇప్పించడం వంటి పనుల్లో ముందుండి నడిపించారు. మనోహర్‌ పారికర్‌ చనిపోయిన తర్వాత.. సీఎం ప్రమోద్‌ సావంత్‌పై కొందరు బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. అదే సమయంలో పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జిగా బాధ్యతలు తీసుకున్న కిషన్‌ రెడ్డి.. పరిస్థితులను అన్నింటినీ చక్కదిద్దడంలో సఫలీకృతం అయ్యారని చెప్పొచ్చు.

Updated Date - 2022-03-11T00:43:00+05:30 IST