దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. భారత బ్యాటింగును ప్రారంభించేది అతడే!

ABN , First Publish Date - 2022-01-18T23:16:10+05:30 IST

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రేపు (బుధవారం) పార్ల్‌లో దక్షిణాఫ్రికాతో తొలి వన్డే జరగనుంది.

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. భారత బ్యాటింగును ప్రారంభించేది అతడే!

పార్ల్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రేపు (బుధవారం) పార్ల్‌లో దక్షిణాఫ్రికాతో తొలి వన్డే జరగనుంది. గాయం కారణంగా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ తప్పుకోవడంతో కేఎల్ రాహుల్ జట్టును నడిపించనున్నాడు. సాధారణంగా వన్డేల్లో రోహిత్‌శర్మ, శిఖర్ ధవన్ బ్యాటింగును ప్రారంభిస్తారు. రాహుల్ 4 లేదంటే ఐదో స్థానంలో బ్యాటింగుకు దిగేవాడు. అయితే, ఇప్పుడు రోహిత్ జట్టులో లేకపోవడంతో కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగును ప్రారంభించనున్నాడు. ఈ విషయాన్ని రాహుల్ స్వయంగా వెల్లడించాడు.


జట్టు అవసరాన్ని బట్టి గత 14-15 నెలలుగా తాను 4, 5 స్థానాల్లోనే బ్యాటింగ్ చేస్తున్నట్టు రాహుల్ చెప్పాడు. ప్రస్తుతం రోహిత్ అందుబాటులో లేకపోవడంతో తానే బ్యాటింగ్ ప్రారంభించనున్నట్టు పేర్కొన్నాడు. తాను ప్రణాళికలు, లక్ష్యాలు ఉన్న వ్యక్తిని కాదని, ఒకసారి ఒక ఆట మాత్రమే ఆడతానన్నాడు. తాను ఎలా ఆడాను? జట్టును ఎలా నడిపించానన్నదే చూస్తానని పేర్కొన్నాడు.


గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌కు శిఖర్ ధవన్ ఎంపిక కాకపోవడంతో రాహుల్ భారత జట్టు రెగ్యులర్ ఓపెనర్‌గా మారాడు. ఇప్పుడు వన్డే సిరీస్‌లో రాహుల్‌కు భాగస్వామిగా ధవన్, లేదంటే రుతురాజ్ గైక్వాడ్‌లలో ఎవరు వస్తారో వేచి చూడాల్సిందే.

Updated Date - 2022-01-18T23:16:10+05:30 IST