కేసుల మాఫీ కోసమే కలిశారు

ABN , First Publish Date - 2020-09-28T11:26:57+05:30 IST

సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి కేసుల మాఫీ కోసమే ఢిలీలో కేంద్ర పెద్దలను కలిశారని టీడీపీ నంద్యాల పార్లమెంట్‌ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి ఆరోపించారు. ఇటీవల వర్షాలకు గండ్లు పడ్డ గువ్వలకుంట్ల, శివపురం చెరువులను ఆదివారం ఆయన పరిశీలించారు.

కేసుల మాఫీ కోసమే కలిశారు

కేంద్రం పెద్దలను సీఎం జగన్‌ కలవడంపై మాండ్ర శివానందరెడ్డి వ్యాఖ్య 

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన టీడీపీ నాయకులు


కొత్తపల్లి, సెప్టెంబరు 27: సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి కేసుల మాఫీ కోసమే ఢిలీలో కేంద్ర పెద్దలను కలిశారని టీడీపీ నంద్యాల పార్లమెంట్‌ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి ఆరోపించారు. ఇటీవల వర్షాలకు గండ్లు పడ్డ గువ్వలకుంట్ల, శివపురం చెరువులను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం మాండ్ర శివనంద రెడ్డి మాట్లాడు తూ భారీ వర్షాలకు కొత్తపల్లి, పాములపాడు మండలాల్లో పత్తి, మొక్కజొన్న వరి, ఉల్లి ,మిరప, పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు.


రైతుకు ఎకరాకు 20 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చెరువులకు గండ్లు పడి చెరువులోని చేపలు కొట్టుకు పోవడంతో మత్స్యకారులు జీవనో పాధి కోల్పోయారని, వారిని ఆదుకోవాలని కోరారు. వైసీపీ నాయకలుఉ టీడీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. జగన్‌కు న్యాయ వ్యవస్థపై గౌరవం లేదని, టీడీపీ హయాంలో అమరావతిలో న్యాయమూర్తులకు ఇంటి స్థలాలు ఇస్తే వాటిపై రాజకీయం చేస్తున్నారని అన్నారు.


మండలంలో శివపురం ఎద్దులేరు వాగుపై హైలెవల్‌ వంతెన ఏర్పాటుకు గోదావరి పుష్కరాలలోనైనా బడ్జెట్‌ కేటాయించి పూర్తి చేయాలని కోరారు. అలాగే వరదలకు దెబ్బతిన్న కొలను భారతి రోడ్డు నిర్మించాలన్నారు. నాయకులు చంద్రశేఖరరెడ్డి, గుండం రమణారెడ్డి, మహేష్‌నాయుడు, శివారెడ్డి లింగస్వామి గౌడ్‌, మద్దూరు తిమ్మారెడ్డి, పోత నారాయణ, మల్లారెడ్డి, రాకృష్ణారెడ్డి, మధుసూధన్‌రెడ్డి, మాసుమయ్య, నాగేశ్వరయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

పాములపాడు: భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను, వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ నంద్యాల పార్లమెంట్‌ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి కోరారు. ఆదివారం మండలంలోని ఇస్కాల ఎస్సీ కాలనీలో వరద బాధితులను పరామర్శించి వారితో మాట్లాడారు. అలాగే ఇస్కాల సమీపంలోని భవనాశి వాగు ఉధృతిని, చెలిమిల్లలో నీట మునిగిన పంటలను పరిశీలించారు.


మాండ్ర శివానందరెడ్డి మాట్లాడుతూ అధిక వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రబీ సీజన్‌కు ఎరువులు, విత్తనాలు ఉచితంగా అందించాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా పంట నష్టపరిహరం తక్షణమే రైతులకు మంజూరు చేయాలన్నారు. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, కాలనీల్లోకి వరద చేరకుండా చర్యలు చేపట్టాలని కోరారు.


బాధితులకు టీడీపీ అండగా ఉంటుందన్నారు. వరదల సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సహయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ యన్నం దుష్షంత్‌రెడ్డి, టీడీపీ మండల నాయకులు హరినాథరెడ్డి, తిమ్మారెడ్డి, బండ్లమూరి వెంకటేశ్వరరావు, శివశంకరస్వామి, గోవిందు, గాండ్ల కృష్ణుడు, మాజీ ఎంపీటీసీ కాంతారెడ్డి, నాగలక్ష్మిరెడ్డి, శేఖర్‌, ఈశ్వర్‌రెడ్డి, కాసీం, స్వాములు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-09-28T11:26:57+05:30 IST