నవంబరు 1కి ఏర్పాట్లు పూర్తి చేయండి: కలెక్టర్
ABN , First Publish Date - 2020-10-29T09:34:10+05:30 IST
నవంబరు 1 రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అధికారులకు కలెక్టర్ వీరపాండియన్ ఆదేశించారు.
కర్నూలు (కల్చరల్), అక్టోబరు 28: నవంబరు 1 రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అధికారులకు కలెక్టర్ వీరపాండియన్ ఆదేశించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏర్పాట్లపై జిల్లా స్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్లో సమీక్షించారు. డీఆర్వో పుల్లయ్య, సమాచార శాఖ ఉప సంచాలకుడు తిమ్మప్ప, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు తెలుగుదనం ఉట్టిపడేలా, సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్వహించేందుకు జిల్లా యంత్రాం గం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉదయం 9.45 నిమిషాలకు చిల్డ్రన్స్ పార్కులోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి తదనంతరం కొండారెడ్డి బురుజు వద్ద తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తామని తెలిపారు. అనంతరం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో కొవిడ్ నియమ నిబంధనలను పాటిస్తూ వేడుకలు నిర్వహిస్తామన్నారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని డీఆర్వో పుల్లయ్యను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా స్థాయి అధికారులందరూ వేడుకల్లో పాలుపంచుకునేలా చూడాలని సూచించారు.
స్వాతంత్య్ర పోరాటంలో త్యాగాలు చేసిన మహనీయుల కుటుంబ సభ్యులు, బంధువులను సన్మానిస్తామని తెలిపారు. క్రాఫ్ట్ మేళా, రంగోలి, ఛాయాచిత్ర ప్రదర్శన, చేనేత, హస్తకళలు, రాయలసీమలో ప్రసిద్ధి చెందిన వంటకాల ప్రదర్శన స్టాళ్లు మొదలైనవాటిని సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.