ఎడమొహం..పెడమొహంగా ఉన్న నేతల కలయిక.. పార్టీలో కొత్త జోష్..!

ABN , First Publish Date - 2021-12-07T17:11:38+05:30 IST

గుంటూరు జిల్లా నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ చదలవాడ అరవింద్‌బాబుతో స్వర్గీయ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం షేక్‌హ్యాండ్‌ ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. స్వర్గీయ కోడెల శివప్రసాద్ నరసరావుపేట

ఎడమొహం..పెడమొహంగా ఉన్న నేతల కలయిక.. పార్టీలో కొత్త జోష్..!

పౌరుషాల పురిటిగడ్డలో ఆ ఇద్దరు నేతలు కలిశారు. పార్టీలో కొత్త జోష్ నింపారు. నిన్నటి వరకు ఎడమొహం ..పెడమొహంగా ఉన్న  ఆ నేతలిద్దరూ ఒక చోట కలుసుకుని మాట్లాడుకోవడం  కేడర్‌లో కొత్త ఉత్సాహనిచ్చింది. ఇంతకు ఎవరా నేతలు? వారిప్పుడు చేతులు కలుపడం వెనుకున్న రాజకీయం ఏంటి? అనే మరిన్ని విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..


నరసరావుపేటలో కోడెల, చదలవాడ షేక్‌హ్యాండ్ 

గుంటూరు జిల్లా నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ చదలవాడ అరవింద్‌బాబుతో స్వర్గీయ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం షేక్‌హ్యాండ్‌ ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. స్వర్గీయ కోడెల శివప్రసాద్ నరసరావుపేట నియోజకవర్గం నుంచి 5 సార్లు టిడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.  పల్నాడు రాజకీయాల్లో  కోడెల తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. నియోజకవర్గం పునర్విభజన నేపథ్యంలో తన స్వంత గ్రామం, మండలం సత్తెనపల్లి సెగ్మెంట్‌లోకి మారడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కోడెల నరసరావుపేటను వీడాల్సివచ్చింది. సత్తెనపల్లి నుంచి పోటీచేసి గెలిచిన కోడెల గత ప్రభుత్వంలో అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. 


కలిసిపనిచేయకపోవడంతో కంచుకోట బద్ధలైందనే టాక్‌  

కోడెల శివప్రసాద్ సత్తెనపల్లి వెళ్లిన నేపథ్యంలో నరసరావుపేటకు ప్రముఖ ఆర్దోపెడిక్ వైద్యుడు చదలవాడ అరవింద్‌కు టిడిపి టికెట్ కేటాయించింది. అయితే అరవింద్‌బాబుకు చివరి నిమిషంలో టికెట్ కేటాయించడం, ప్రచార సమయం లేకపోవడం లాంటి కారణాలతో ఓటమి చెందారు . అయితే చదలవాడ అరవింద్‌కు ఎన్నికలలో కోడెల వర్గం సహాకరించలేదని ప్రచారం జరిగింది. అప్పటి నుంచి కోడెల వర్గం , అరవింద్ బాబు వర్గంగా నరసరావుపేట టిడిపిలో రాజకీయాలు నడుస్తున్నాయి. ఇద్దరు కలసి పని చేయకపోవడం వల్లే  టిడిపీకి కంచుకోట అయిన  నరసరావుపేటలో ఓటమి చెందినట్లు గుసగుసలు వినిపించాయి.


కోడెల శివప్రసాద్‌ సేవలు గుర్తుచేస్తున్న అరవింద్‌బాబు 

నరసరావుపేట టిడిపి ఇన్‌చార్జ్ అరవింద్ బాబు ప్రతి సభలో కోడెల శివ ప్రసాద్  నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి, టిడిపికి చేసిన సేవలను గుర్తు చేస్తూ ఉన్నారు. స్వర్గీయ కోడెలకు సంబంధించిన ప్రతి కార్యక్రమంలో అరవింద్‌బాబు పాల్గొంటూ వస్తున్నారు. కార్యకర్తల మనోభావాలను గుర్తించిన కోడెల శివ ప్రసాద్ తనయుడు కోడెల శివరాం నరసరావుపేటలో  చదలవాడ అరవింద్‌తో స్నేహహస్తం అందించేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు కోడెల శివరాం తొలిసారిగా చదలవాడ అరవింద్ ఇంటికి వెళ్లి స్వయంగా కలిశారు. కొద్దిసేపు ఇద్దరు పార్టీ బలోపేతంపై చర్చించుకున్నారు. ఇకపై నరసరావుపేట నియోజకవర్గంలో టిడిపి బలోపేతానికి శక్తి వంచన లేకుండా తన వంతు కృషి చేస్తానని అరవింద్ బాబుతో కోడెల చెప్పినట్లు సమాచారం.  

జూనియర్‌ కోడెల, చదలవాడ కలయికతో నరసరావుపేటలో టీడీపీ బలపేతం అవుతుందని  కేడర్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇద్దరు కీలకనేతల కలయిక గుంటూరు జిల్లాలో రాజకీయ ప్రాధాన్యతకు తెరలేపింది. పల్నాడు పాలిటిక్స్‌లో మార్పునకు సంకేతమనే టాక్‌ వస్తోంది. 

Updated Date - 2021-12-07T17:11:38+05:30 IST