కోయంబత్తూరులో రెండు కొత్త ఫ్లైఓవర్లు

ABN , First Publish Date - 2022-06-12T16:05:43+05:30 IST

వాణిజ్య నగరం కోయంబత్తూరులో కొత్తగా నిర్మించిన రెండు ఫ్లైఓవర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రారంభించారు. ఆ నగరంలో రూ.230 కోట్ల

కోయంబత్తూరులో రెండు కొత్త ఫ్లైఓవర్లు

చెన్నై, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): వాణిజ్య నగరం కోయంబత్తూరులో కొత్తగా నిర్మించిన రెండు ఫ్లైఓవర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రారంభించారు. ఆ నగరంలో రూ.230 కోట్ల వ్యయంతో రామనాధపురం, సుంగం జంక్షన్లను కలుపుతూ నెం-67 జాతీయ రహదారిలో నిర్మించిన ఫ్లైఓవర్‌కు, ఆ రహదారిలోనే రూ.60 కోట్ల వ్యయంతో గౌండంపాళయం వద్ద నిర్మించిన ఫ్లైవోర్‌కు సచివాలయంలో శనివారం ఉదయం ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన ప్రారంభోత్సవం చేశారు. రామనాధపురం, సుంగం జంక్షన్లను కలుపుతూ 3.15 కి.మీల పొడవుతో నిర్మించిన ఫ్లైఓవర్‌లో నాలుగు రహదార్లు ఉన్నాయి. ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించడంతో రామనాధపురం, ఒలంపస్‌, సుంగం జంక్షన్లు, అలవేనియా స్కూలు జంక్షన్‌, శౌరిపాళయం జంక్షన్‌, పులియకుళం ఎక్స్‌టెన్స్‌ రహదారి కూడలి, రేడియో కేంద్రం జంక్షన్‌లలో వాహనాల రద్దీ తగ్గుతుందని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. గౌండంపాళయం జంక్షన్‌ వద్ద 1.17 కి.మీ.ల పొడవుతో నిర్మించిన ఫ్లైఓవర్‌లో నాలుగు రహదారులు ఉండటంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు సులభతరమవుతాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఏవీ వేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, రహదారులు చిన్న ఓడరేవుల శాఖ ప్రధాన కార్యదర్శి ధీరజ్‌కుమార్‌, చీఫ్‌ ఇంజనీర్‌ (జాతీయ రహదారుల విభాగం) ఎన్‌.బాలమురుగన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-12T16:05:43+05:30 IST