ప్రజలపై రూ.75 వేల కోట్ల పన్నుల భారం
ABN , First Publish Date - 2021-01-17T06:15:40+05:30 IST
ప్రజలపై రూ.75 వేల కోట్ల పన్నుల భారం
మచిలీపట్నం టౌన్, జనవరి 16: ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం మోయలేని విధంగా రూ.75 వేల కోట్ల పన్నుల భారం మోపిందని మాజీ ఎంపీ, టీడీపీ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు. శనివారం తన కార్యాలయం వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా ఏప్రిల్ నుంచి పన్నుల భారం విధిస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుతం ఇళ్లకు మాత్రమే పన్నులు వేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానం వల్ల ఇళ్లతో పాటు ఇళ్ల పక్కన ఉండే స్థలానికి ఆస్తి పన్ను విధిస్తారని ఆయన పేర్కొన్నారు. మునిసిపల్ చట్టాల్లో సవరణ చేసి ప్రజలను ప్రభుత్వం నట్టేట ముంచిందన్నారు. ఇదివరకు కమర్షియల్ జోన్లు, రెసిడెన్షియల్ జోన్లుగా విభజించి పన్నులు వేసేవారన్నారు. ఇప్పుడు కొత్త చట్టంలో పన్నుల విలువ గణనీయంగా పెరిగిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.