అన్నదాతలను తక్షణమే ఆదుకోవాలి: మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ
ABN , First Publish Date - 2020-12-01T15:22:30+05:30 IST
నివర్ తుఫాను ప్రభావంతో అతలాకుతలమైన..
పామర్రు(కృష్ణా): నివర్ తుఫాను ప్రభావంతో అతలాకుతలమైన అన్నదాతలను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని బందరు పార్లమెంట్ మాజీ సభ్యులు, టీడీపీ ఇన్చార్జి కొనకళ్ల నారాయణరావు అన్నారు. తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులను పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులతో కలిసి కొనకళ్ల పామర్రులో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులను అందించడంలో ప్రభుత్వం నిర్లక్యం ప్రదర్శించిందని, ఈక్రాప్ నమోదు లేదనే సాకుతో రైతులకు మొండిచేయి చూపకుండా దెబ్బతిన్న ప్రతి రైతుకూ సాయం అందేవిధంగా క్షేత్రస్థాయిలోని అధికార్లు మానవతా దృక్పథంతో వ్యవహరించి రైతులను ఆదుకోవాలని కోరారు. వారితోపాటు ఏఎంసీ మాజీ చైర్మన్లు మండపాక శంకర్బాబు, వల్లూరిపల్లి గణేష్, పార్టీ నేతలు సుబ్రమణ్యం, జడ్పీటీసీ అభ్యర్థి లాజరస్, దాలిపరి ్తప్రసాద్, చాట్ల రమేష్ పాల్గొన్నారు.
సొంత లాభాల కోసమే వైసీపీ పాలసీలు
మచిలీపట్నం టౌన్ : వైసీపీ ప్రభుత్వం తమ సొంత లాభాల కోసమే పథకాలు ప్రవేశపెడుతోందని, ప్రజా సమస్యలపై దృష్టి సారించడం లేదని మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు విమర్శించారు. సోమవారం మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కొనకళ్ల నారాయణరావు ప్రసంగించారు. 18 నెలల వైసీపీ పాలనలో పేదలపై ఊహించని విధంగా పన్నులు వేసి పెనుభారం మోపారన్నారు. నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేలు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు.