Huzurabad ఫలితాల తర్వాత రేవంత్రెడ్డిపై కౌశిక్ సంచలన ఆరోపణలు
ABN , First Publish Date - 2021-11-03T13:43:42+05:30 IST
Huzurabad ఫలితాల తర్వాత రేవంత్రెడ్డిపై కౌశిక్ సంచలన ఆరోపణలు
కరీంనగర్ : హుజురాబాద్ ఉప ఎన్నికలో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కాంగ్రెస్ టికెట్ను రూ.25 కోట్లకు బీజేపీకి అమ్ముకున్నారని టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు. మంగళవారం స్థానిక ఎస్ఆర్ఆర్ కళాశాలలోని ఓటింగ్ కేంద్రంలో మీడియా సెంటర్లో ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్, బీజేపీతో కలిసి పోటీ చేశాయని ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్కుమార్రెడ్డి హయాంలో హుజూరాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తాను పోటీచేస్తే 62వేలపై చిలుకు ఓట్లు వచ్చాయన్నారు. రేవంత్రెడ్డి హయాంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన బల్మూరి వెంకట్నర్సింగారావుకు డిపాజిట్ కూడా దక్కలేదన్నారు.
కాగా.. హుజూరాబాద్ మ్యాచ్లో ప్రధాన పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగినా చివరికి, ఎక్స్ట్రా ప్లేయర్గా నిలిచింది మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్!. అభ్యర్థిత్వం లభించినా ఇటు పార్టీ నుంచి అటు నాయకుల నుంచి ఆయనకు పూర్తిస్థాయి సహకారం లభించలేదు. చాలామంది నాయకులు అసలు ప్రచారానికే రాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, బల్మూరి వెంకట్ ఒంటరి ప్రచారం చేయాల్సి వచ్చింది. చివరికి, రెండు పొట్టేళ్ల మధ్య నలిగిన లేగదూడ మాదిరిగా ఆయన డిపాజిట్ కూడా కోల్పోవాల్సి వచ్చింది.