ఇది మా పోరాట ఫలితమే...
ABN , First Publish Date - 2022-04-30T17:41:38+05:30 IST
పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ల పరీక్షల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని తాము ఇంతకాలం చేస్తూ వచ్చిన వాదన నిజమని తేలిందని కేపీసీసీ పేర్కొంది. కేపీసీసీ కార్యాధ్యక్షుడు
- కేపీసీసీ కార్యాధ్యక్షుడు ఆర్.రామలింగారెడ్డి
బెంగళూరు: పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ల పరీక్షల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని తాము ఇంతకాలం చేస్తూ వచ్చిన వాదన నిజమని తేలిందని కేపీసీసీ పేర్కొంది. కేపీసీసీ కార్యాధ్యక్షుడు ఆర్.రామలింగారెడ్డి నగరంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ దొడ్డిదారిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల్లోకి పంపేందుకు భారీకుట్ర జరిగిందన్నారు. ఇప్పుడు మొత్తం పరీక్షలు రద్దు కావడంతో ప్రతిభావంతులైన అభ్యర్ధులకు న్యాయం దక్కనుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగినా ప్రభుత్వం తొలుత బుకాయించిందని తీరా నిజాలు బయటపడ్డాక ఇరకాటంలో పడిందన్నారు. నియామకాల ఇన్చార్జిగా ఉన్న ఏడీజీపీ అమృత్పాల్ను బదిలీచేయడంతోనే ప్రభుత్వం ఈ అక్రమాల నిజాన్ని అంగీకరించినట్లయిందన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో దోషులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. పోలీస్ శాఖలో నియామకాలే పారదర్శకంగా సాగకపోతే ప్రజలకు ఈ వ్యవస్ధపై నమ్మకం ఎలా కలుగుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లోనూ అవినీతి విలయతాండవం చేస్తోందని రానున్న రోజుల్లో మరిన్ని అక్రమాలను తమ పార్టీ బయటపెడుతుందని ఆయనప్రకటించారు. భారీగా అక్రమాలు చోటు చేసుకున్న పిఎస్ ఐ పరీక్షలను పూర్తిగా రద్దుచేస్తున్నట్లు హోంమంత్రి అరగజ్ఞానేంద్ర ప్రకటించడం తమ పోరాటానికి లభించిన విజయమన్నారు.