Krishna జిల్లా: తమవారు క్షేమంగా తిరిగి రావాలని గంగమ్మకు పూజలు

ABN , First Publish Date - 2022-07-07T16:34:38+05:30 IST

మచిలీపట్నం (Machilipatnam)లో నలుగురు మత్స్యకారుల గల్లంతు ఘటన కలకలం రేపుతోంది.

Krishna జిల్లా: తమవారు క్షేమంగా తిరిగి రావాలని గంగమ్మకు పూజలు

కృష్ణా (Krishna) జిల్లా: మచిలీపట్నం (Machilipatnam)లో నలుగురు మత్స్యకారుల గల్లంతు ఘటన కలకలం రేపుతోంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లి ఐదు రోజులైనా వారి జాడ ఇంతవరకు లభించలేదు. దీంతో కోస్టు గార్డు (Coast Guard) బృందాలు రంగంలోకి దిగాయి. మత్స్యకారుల ఆచూకీ దొరక్కపోవడంతో క్యాంప్‌బెల్‌ పేట గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. 


ఆదివారం రాత్రి కాకినాడ (Kakinada) సమీపంలో అంతర్వేది దగ్గర బోటు మోటార్ పనిచేయడంలేదని యజమానికి మత్స్యకారులు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వారి ఫోన్లు కూడా పనిచేయలేదు. ఈ క్రమంలో అధికారులు సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ప్రయోజనం లేకుండాపోయింది. కాకినాడ సమీపంలోని అంతర్వేది దగ్గర బోటు మునిగి ఉండవచ్చునని, ఏ తీరానికైనా కొట్టుకుపోయి ఉండొచ్చునని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు గాలింపు చర్యలకు వాతావరణం అనుకూలించకపోవడంతో నిలిపివేశారు. వాతావరణం చక్కబడిన తర్వాత గాలింపు చర్యలు చేపడతామని అధికారులు చెబుతున్నారు. అయితే తమ వారు క్షేమంగా తిరిగి రావాలని వారి కుటుంబ సభ్యులు దేవుడిని ప్రార్థిస్తున్నారు. గంగమ్మ తల్లినే నమ్ముకున్న తమకు గంగమ్మ అన్యాయం చేయదని, వారిని సురక్షితంగా ఇంటికి చేర్చాలంటూ గంగమ్మకు సంప్రదాయ పద్ధతిలో శాంతి పూజలు నిర్వహించారు.

Updated Date - 2022-07-07T16:34:38+05:30 IST