కృష్ణంరాజు సంస్మరణ సభకు ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-09-28T05:47:04+05:30 IST

కేంద్ర మాజీ మంత్రి రెబల్‌ స్టార్‌ యూవీ కృష్ణంరాజుకు గురువారం మొగల్తూరులో నిర్వహించే సంస్మరణ సభ, సమారాధన కార్యక్రమాలకు ప్రతి ఇంటింటికి కుటుంబ భోజనం చేయాలని సమాచారం అందించారు.

కృష్ణంరాజు సంస్మరణ సభకు ఏర్పాట్లు
కృష్ణంరాజు నివాసం వద్ద పందిళ్లు వేస్తున్న సిబ్బంది

మొగల్తూరు, సెప్టెంబరు 27 : కేంద్ర మాజీ మంత్రి రెబల్‌ స్టార్‌ యూవీ కృష్ణంరాజుకు గురువారం మొగల్తూరులో నిర్వహించే సంస్మరణ సభ, సమారాధన కార్యక్రమాలకు ప్రతి ఇంటింటికి కుటుంబ భోజనం చేయాలని సమాచారం అందించారు. ఈ నెల 11న కృష్ణంరాజు హైదరాబాద్‌లో మృతి చెందారు. 22, 23 తేదీలలో అక్కడే దశ, దిన కార్యక్రమాలను నిర్వహించారు. కృష్ణంరాజుకు సొంతూరు మొగల్తూరులో సంస్మరణ సభ నిర్వహణకు ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ప్రతీ ఇంటికి సమాచారం అందిస్తున్నారు. మొగల్తూరు మండలంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కృష్ణంరాజుకు అనుబంధంగా ఉండే ప్రతీ ఒక్కరినీ ఆహ్వానిస్తున్నారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులతో పాటు సినీ హీరో ప్రభాస్‌ హాజరవుతున్నారు. 50 వేలకు మందికి పైబడి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామంలో ఇబ్బందులు తలెత్తకుండా బారికేడ్లతో పాటు పూర్తిస్థాయిలో పోలీస్‌ సెక్యూరిటీ కల్పిస్తున్నారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులు, అభిమానులు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఏర్పాట్లులో నిమగ్నమయ్యారు. స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పర్యటించి ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందిస్తామన్నారు. జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్‌ ప్రోగ్రామ్‌ షెడ్యూల్‌ను పరిశీలించి అవనరమయ్యే పోలీస్‌ సిబ్బందిని పంపుతున్నట్టు తెలిపారు. మంగళవారం కలెక్టర్‌ పి,ప్రశాంతి, సబ్‌కలెక్టర్‌ విష్ణుచరణ్‌, స్థానిక అధికారులు, పంచాయతీ సిబ్బంది, ఆయా ప్రాంతాలను పరిశీలించారు. 

Updated Date - 2022-09-28T05:47:04+05:30 IST