KSRTC ఉద్యోగులకు మేడే శుభవార్త...7200 మందిపై క్రమశిక్షణ కేసుల రద్దు
ABN , First Publish Date - 2022-05-02T14:36:03+05:30 IST
కార్మిక దినోత్సవం సందర్భంగా కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కెఎస్ఆర్టిసి) ఉద్యోగులకు శుభవార్త వెల్లడించింది....
బెంగళూరు: కార్మిక దినోత్సవం సందర్భంగా కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కెఎస్ఆర్టిసి) ఉద్యోగులకు శుభవార్త వెల్లడించింది. కెఎస్ఆర్టిసికి చెందిన 7,200 మంది ఉద్యోగుల క్రమశిక్షణా కేసులను మాఫీ చేసినట్లు ఆ సంస్థ అధికారిక ప్రకటన తెలిపింది.పది నెలల లోపు విధులకు గైర్హాజరైన ఉద్యోగులపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు లేకుండా కేసులను ఎత్తివేశారు. ఉద్యోగులు వెంటనే రిపోర్టింగ్ ఆర్డర్ జారీ చేసి బస్సు నడిపేందుకు అనుమతిస్తున్నామని, దీని ప్రకారం గత మూడు రోజుల నుంచి 110 మంది గైర్హాజరైన ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. కార్పొరేషన్లోని మొత్తం 35,000 మంది ఉద్యోగులుండగా వారిలో 8,414 మంది క్రమశిక్షణా కేసులను ఎదుర్కొంటున్నారు. 7,200 క్రమశిక్షణా కేసుల్లో కనిష్ఠంగా రూ. 100, రూ. 200 గరిష్టంగా రూ. 500 జరిమానాతో రద్దు చేశారు.
మిఠాయిలతోపాటు క్రమశిక్షణా కేసు ఉపసంహరణ ఆర్డర్ కాపీని ఉద్యోగులకు మేనేజింగ్ డైరెక్టర్ వి అన్బుక్కుమార్ అందించారు. ఉద్యోగులను శిక్షించడమే కాకుండా వారిని ప్రోత్సహించడం, వారి సంక్షేమానికి కృషి చేయడం తమ కర్తవ్యమని అన్బుక్ కుమార్ అన్నారు.