సాహసోపేత సంస్కరణలు తక్షణావసరం: కేటీఆర్‌

ABN , First Publish Date - 2020-08-09T08:38:56+05:30 IST

సానుకూల విధానాలు దేశంలోకి పెట్టుబడులను ఆకర్షిస్తాయి. నేటి తక్షణ అవసరం సాహసోపేత సంస్కరణలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు.

సాహసోపేత సంస్కరణలు తక్షణావసరం: కేటీఆర్‌

  • మూడు ‘ఐ’లపై దృష్టి పెట్టాలి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సానుకూల విధానాలు దేశంలోకి పెట్టుబడులను ఆకర్షిస్తాయి. నేటి తక్షణ అవసరం సాహసోపేత సంస్కరణలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. భారత్‌లో విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి సానుకూల విధానాలను రూపకల్పన చేయాల్సి ఉంది. ఈ దిశగానే తెలంగాణ ప్రభుత్వం ఈ నెల ఆరున అత్యుత్తమ ఎలక్ట్రికల్‌ వాహనాల విధానాన్ని ప్రవేశపెట్టిందని సీఐఐ ఏర్పాటు చేసిన ‘ఇండియా ఎట్‌ 75 సదస్సు’లో పేర్కొన్నారు. కొవిడ్‌తో గతంలో ఎన్నడూ లేనంతగా టెక్నాలజీలతో ముడిపడి పోయామని, డిజిటల్‌ సొల్యూషన్ల అమలు, దూరంగా ఉండి పని చేయడం వంటి కొత్త విధానాలను వేగిరం చేయడంలో  టెక్నాలజీ సహాయ పడిందని మంత్రి అన్నారు.


యువతదే కీలక పాత్ర: ప్రపంచవ్యాప్తంగా భారత టెక్నాలజీ నిపుణులు ఉన్నారు. గత రెండు దశాబ్దాల్లో పరిశ్రమలను ముందుకు తీసుకువెళ్లడంలో కీలకపాత్ర పోషించారు. టెక్నాలజీ రంగంలో భారత నిపుణులు తమ స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకోవడానికి కొవిడ్‌ ఒక వేదికగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థకు, పరిశ్రమలకు ఊతమివ్వడంలో యువత కీలక పాత్ర పోషించగలరని కేటీఆర్‌ తెలిపారు. ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌ దేశానికి తక్షణ అవసరాలని  (3 ‘ఐ’ లు) పేర్కొన్నారు. రానున్న రోజుల్లో  5జీ టెక్నాలజీ కీల క పాత్ర పోషించనుందని, తక్కువ వ్యయంతో మెరుగైన 5జీ సొల్యూషన్లను అభివృద్ధి చేయగల సామర్థ్యం భారత్‌కు ఉందని చెప్పారు. 

Updated Date - 2020-08-09T08:38:56+05:30 IST