ఢిల్లీ నేతలతో అభివృద్ధి జరగదు: కేటీఆర్
ABN , First Publish Date - 2020-11-27T01:03:01+05:30 IST
గ్రేటర్ ఎన్నికల వేళ నాయకులు పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. గురువారం మంత్రి కేటీఆర్ మల్కాజ్గిరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ..
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల వేళ నాయకులు పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. గురువారం మంత్రి కేటీఆర్ మల్కాజ్గిరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గండిపేటను మించిన చెరువును త్వరలో నిర్మిస్తామన్నారు. హైదరాబాద్కు కేంద్రమంత్రులు గుంపులు గుంపులుగా వస్తున్నారని హైదరాబాద్కు వరద వచ్చినప్పుడు వీళ్లంతా ఎక్కడకు పోయారని బీజేపీ నేతలను విమర్శించారు.
వరద సాయంపై కేంద్రానికి లేఖ రాస్తే.. జవాబు లేదని ఇప్పుడు మాత్రం రోజుకొక నాయకుడు ఢిల్లీ నుంచి వచ్చి ఓట్లు రాబట్టడానికి డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని వారి మాటలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ సర్కారు వచ్చిన ఏడేళ్లలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. బల్దియాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామని చెప్పారు. బీజేపీ నేతలు హిందూవులు, ముస్లింల మధ్య గొడవ పెట్టేలా చేస్తున్నారని దీనిని ప్రజలు ఓట్లతో తిప్పి కొట్టాలని అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చే నేతలతో ఏమీ జరగదని టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయాలని కేటీఆర్ అన్నారు.