కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ కేటీఆర్

ABN , First Publish Date - 2021-03-04T23:40:29+05:30 IST

కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ కేటీఆర్

కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ కేటీఆర్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రతిసారి రాష్ట్రానికి అన్యాయం చేస్తూనే ఉందని, తాజాగా రాష్ట్ర పునర్ విభజన చట్టంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని సైతం తుంగలో తొక్కి మరోసారి తెలంగాణ పట్ల తన వ్యతిరేక వైఖరిని బీజేపీ చాటుకుందని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు అన్నారు. 


తాజాగా ఒక సమాచార హక్కు పిటీషన్‌కు సమాధానం ఇస్తూ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదంటూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి కార్యాలయం నుంచి ఇచ్చిన సమాధానంపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికే హైదరాబాద్ నగర ఐటి అభివృద్ధిని అడ్డుకునేలా ఐటిఐఆర్ ప్రాజెక్టుని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఖాజీపేట రైల్వే ప్రాజెక్టు అవసరం లేదని స్పష్టం చేయడం వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసినట్టయిందని కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే మార్చుకుని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు దిశగా విస్పష్టమైన ప్రకటన చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.    


కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి స్వయంగా సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని, పలుమార్లు లేఖలు రాసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. మరోవైపు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిన అన్ని ప్రయత్నాలను తాము చేస్తూనే ఉన్నామన్నారు. ఇందులో భాగంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి అవసరమైన స్థల సేకరణ కూడా పూర్తయిందని కేటీఆర్ తెలిపారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం అత్యంత విలువైన 150 ఎకరాల భూమిని ప్రత్యేక శ్రద్ధతో మరో ప్రభుత్వ శాఖ నుంచి సేకరించి కేంద్ర రైల్వే శాఖకు అప్పగించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.  


తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన ప్రాజెక్టుల విషయంలో పదే పదే సంప్రదింపులు జరుపుతున్నా, కేంద్రంలోని బిజెపి నుండి ఎలాంటి స్పందన లేదని, తెలంగాణకు రిక్తహస్తం చూపడం బీజేపీకి అలవాటుగా మారిందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పెండింగ్లో ఉన్న 8 రైల్వే లైన్లు, సర్వే దశలో ఉన్న 3 లైన్ లు, 4 నూతన రైల్వే లైన్ల ప్రతిపాదనలు, రైల్వే ఖాజీపేట వ్యోగన్ ఫ్యాక్టరీ, ఖాజీపేట రైల్వే డివిజన్ , రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు వంటి డిమాండ్లకు సైతం కేంద్రం నుండి కనీస స్పందన లేదని, ప్రతిసారి బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్నానే దిక్కవుతోందని మంత్రి అన్నారు. తాజాగా ఈ సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లోనూ తెలంగాణ రాష్ట్రంలోని రైల్వేలైన్ లకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం కేంద్ర ప్రభుత్వ వివక్ష పూరిత వైఖరికి నిదర్శనమన్నారు.  కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న బుల్లెట్ ట్రైన్ మరియు హై స్పీడ్ రైల్వేలైన్ లకు సంబంధించి కూడా తెలంగాణకి బిజెపి తీవ్ర అన్యాయం చేసిందని, హైదరాబాద్ వంటి మహానగరానికి కూడా ఈ బుల్లెట్/స్పీడ్ ట్రైన్లు కేటాయించకపోవడం ఈ వివక్షకు తార్కాణం అని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు.  


తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయడమే కాకుండా రైల్వేలను ప్రైవేట్ పరం చేస్తూ భవిష్యత్ తరాలకు బిజెపి ద్రోహం చేస్తోందని మంత్రి కేటీఆర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. భారతదేశ రవాణా వ్యవస్థకు గుండెకాయ లాంటి రైల్వే వ్యవస్థను సంపూర్ణంగా ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్రం కుటిల యత్నాలు చేస్తుందన్నారు.ఇప్పటికే దేశవ్యాప్తంగా అత్యంత రద్దీ కలిగిన 12 క్లస్టర్ లను గుర్తించి 109 ప్రధాన రైలు మార్గాలను ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందని, ఈ ప్రైవేటీకరణ నిర్ణయం ద్వారా రైల్వేలకు సుమారు 63 వేల కోట్ల రూపాయల వార్షిక ఆదాయం కోల్పోయే అవకాశం ఉందని కేటీఆర్ అన్నారు. 


లాభాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ కంపెనీలను చవకగా అమ్మేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాల్లో రైల్వేను కూడా భాగం చేయడం అత్యంత బాధాకరమని కేటీఆర్ అన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విదేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న ఏడు రైల్వే ప్రొడక్షన్ యూనిట్లను అత్యంత చవకగా ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. రైల్వే లైన్ లతో పాటు రైల్వే స్టేషన్ లను సైతం ప్రైవేట్ పరం చేస్తూ.. సాధారణ ప్రజలకి రైల్వేస్టేషన్ లోకి ప్రవేశం లేకుండా రైల్వే స్టేషన్ల పైన ఆధారపడిన లక్షలాది మంది ఉద్యోగుల పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తుంది. 


రైల్వేలనుప్రైవేట్ పరం చేసేందుకు అత్యంత ఉత్సాహంతో ముందుకు పోతున్న కేంద్ర ప్రభుత్వం స్థానికంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ళు మరియు రోడ్డు విస్తరణ వంటి కార్యకలాపాలకు కావాల్సిన స్థలాన్ని అడిగితే మాత్రం ఎనలేని తాత్సారం చేస్తోంది, కానీ ఇదే భూములను ప్రైవేటుపరం చేసేందుకు మాత్రం అత్యంత ఉత్సాహం చూపుతుందన్నారు. రైల్వేల ప్రైవేటీకరణ చేయడంతో దేశంలో అత్యధికంగా ఉద్యోగాలు ఇస్తున్న ప్రభుత్వరంగ సంస్థ అయిన రైల్వే నుంచి నూతన ఉద్యోగ నోటిఫికేషన్ రాకుండా దేశంలోని లక్షలాది మంది యువత భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి ఉందని మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ స్థానికంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం గగ్గోలు పెడుతున్న బిజెపి నాయకులు ఈ విషయంలో సమాధానం చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. 


రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనవసరం అన్న కేంద్ర ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని లేకుంటే తమ పార్టీ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తగిన కార్యాచరణ చేపడుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపైన  కేంద్రాన్ని టీఆర్ఎస్ ఎంపీలు  ప్రశ్నిస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడటం కోసం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఏలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ ఈ సందర్భంగా బీజేపీని హెచ్చరించారు.

Updated Date - 2021-03-04T23:40:29+05:30 IST