కుంభాభిషేకంలో పాల్గొన్న ముస్లింలు

ABN , First Publish Date - 2022-06-10T15:41:36+05:30 IST

తిరువారూరు జిల్లా కూత్తనల్లూరులో హిందువులు, ముస్లింలు కలసికట్టుగా ముత్తుమారియమ్మన్‌ ఆలయ మహాకుంభాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి

కుంభాభిషేకంలో పాల్గొన్న ముస్లింలు

చెన్నై, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): తిరువారూరు జిల్లా కూత్తనల్లూరులో హిందువులు, ముస్లింలు కలసికట్టుగా ముత్తుమారియమ్మన్‌ ఆలయ మహాకుంభాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి మతసామరస్యాన్ని ఎలుగెత్తి చాటారు. ఆ ఆలయంలోని ముత్తుమారియమ్మన్‌ ఆలయం, ఆ ఆలయ ప్రాంగణంలోని వినాయకుడు, బాలమురుగన్‌ సన్నిధులకు 15 ఏళ్ల తర్వాత గురువారం ఉదయం కుంభాభిషేక మహోత్సవం నిర్వహించారు. ఆ మేరకు పండుతక్కడి గ్రామస్తులు, అక్కరై పుదువీది వాసులు, ముస్లింలు, భక్తులంతా కలిసి ఈ వేడుకలను ఘనంగా జరిపారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాల మండపంలో ప్రత్యేక వేదికపై పవిత్ర నదీజలాలున్న కలశాలను ప్రత్యేక వేదికపై ఉంచి విఘ్నేశ్వర పూజ సహా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం ఉదయం యాగపూజ గోపూజ, సరస్వతిపూజతో పూర్ణాహుతి జరిపారు. ఆ తర్వాత ఉదయం 10.15 గంటలకు తిరువాడుదురై కీర్తివాసన్‌ గురుక్కల్‌ పర్యవేక్షణలో ఆలయ ప్రధానార్చకులు కే బాలకృష్ణన్‌, మరో పదిమంది వేదపండితులు యాగశాలలోని పవిత్రజలాలున్న కలశాలలను గ్రామస్తులు, ముస్లిం మతపెద్దల సమక్షంలో ఊరేగింపుగా ఆలయ రాజగోపురాలపైకి తీసుకెళ్ళారు. ఆ తర్వాత గోపురకలశాలను పవిత్ర జలాలతో అభిషేకించారు. ఈ వేడుకల్లో నగరపంచాయతీ సభ్యుడు ఆర్‌ మహమ్మద్‌ కాదర్‌ మైదీన్‌, నగరపంచాయతీ మాజీ సభ్యుడు మీరామైదీన్‌ తదితరులు పాల్గొన్నారు. ఆ గ్రామంలోని హిందువులు, ముస్లింలు కలిసి ఈ కుంభాభిషేకవేడుకల్లో పాల్గొని మతసామరస్యాన్ని చాటడం విశేషం. 



Updated Date - 2022-06-10T15:41:36+05:30 IST