సీఎం జగన్‌.. పక్కన్నేను..!

ABN , First Publish Date - 2021-10-13T14:25:40+05:30 IST

‘‘ఏపీ సీఎం జగన్‌.. పక్కన్నేను’’..

సీఎం జగన్‌.. పక్కన్నేను..!

అన్ని శాఖలూ మనవే.. మాజీ సీఎంల ఫొటోలతో అమాయకులకు బురిడీ

ఉద్యోగాల పేరుతో రూ. 1.68 కోట్లు కొల్లగొట్టిన హెడ్‌కానిస్టేబుల్‌

నకిలీ ఐడీ కార్డుతో అదనపు ఎస్పీగా చలామణి

ఆట కట్టించిన సైబరాబాద్‌ పోలీసులు


హైదరాబాద్‌ సిటీ(ఆంధ్రజ్యోతి): ‘‘ఏపీ సీఎం జగన్‌.. పక్కన్నేను’’..! ‘‘మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి.. పక్కన్నేను’’..! ‘‘ఇక్కడ చూడు.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పటి ఫొటో.. పక్కన్నేను’’..! ‘‘సీఎం రోశయ్య.. పక్కన్నేను’’..! అంటూ నిరుద్యోగులను బురిడీ కొట్టించి, రూ. 1.68 కోట్లు కొల్లగొట్టిన ఓ కేడీ హెడ్‌కానిస్టేబుల్‌ ఆటను సైబరాబాద్‌ పోలీసులు కట్టించారు. వివరాల్లోకి వెళ్తే..


ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా అవుకు మండలం ఉప్పలపాడుకు చెందిన షేక్‌ షావలి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు బెటాలియన్‌(టీఎస్ఎస్‌పీ)లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హైదర్షాకోట్‌ సమీపంలో ఉన్న హిమగిరికాలనీలో ఉంటున్నాడు. గతంలో ఏపీఎస్పీలో ఉన్నప్పటి నుంచే ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌(ఐఎస్‌డబ్ల్యూ)లో పనిచేసేవాడు. అలా.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పటి నుంచి.. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలలో ముఖ్యమంత్రి భద్రతలో విధులు నిర్వహించేవాడు. అప్పట్లో ముఖ్యమంత్రులతో కలిసి దిగిన ఫొటోలు.. వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో దిగిన ఫొటోలను చూపిస్తూ.. తనకు ఏపీ సర్కారులో పలుకుబడి ఉందంటూ నమ్మించాడు. పనిచేస్తుంది కానిస్టేబుల్‌గానే అయినా.. ఏపీ ఐఎస్‌డబ్ల్యూలో అదనపు ఎస్పీగా నకిలీ ఐడీ కార్డులు సృష్టించాడు. తనను తాను అదనపు ఎస్పీ అని చెప్పుకొంటూ.. అన్ని శాఖల్లో పట్టుందని, ఇట్టే ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించేవాడు. అలా 2016 నుంచి ఇప్పటి వరకు 18 మంది నిరుద్యోగులను నమ్మించి రూ. 1.68 కోట్లు కొల్లగొట్టాడు.


డబ్బులు తీసుకున్నాక బాధితుల ఫోన్లను ఎత్తకపోవడం.. వారికి కనిపించకుండా తప్పించుకుతిరగడం చేస్తుండేవాడు. ఇలాగే షేక్‌ షావలీ చేతిలో మోసపోయిన దేవదుర్గం నర్సింహ అనే బాధితుడు.. సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్రకు ఫిర్యాదు చేశారు. ఏపీ జెన్‌కోలో అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, తన వద్ద రూ. 10 లక్షలు తీసుకున్నట్లు తెలిపారు. సీపీ ఆదేశాలతో నార్సింగి ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌, ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌, ఎస్సైలు బలరామ్‌, విజయ్‌వర్ధన్‌, వారి బృందాలతో రంగంలోకి దిగాయి. నిందితుడి ఆటను కట్టించాయి. తదుపరి దర్యాప్తులో నిందితుడు షావలీ తాను చేసిన మోసాల చిట్టాను బయటపెట్టాడు. ఆ డబ్బును తన భార్య ఖాతాలకు బదిలీ చేయించేవాడినని, మూడు లారీలు, రెండు ఖరీదైన ఇళ్లు, ప్లాట్లు కొనుగోలు చేసినట్లు అంగీకరించాడు. అదనపు ఎస్పీ ఐడీకార్డుతో నాగోల్‌లోని ఓ బ్యాంకులో రూ. 50 లక్షల రుణం తీసుకున్నట్లు వెల్లడించాడు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-10-13T14:25:40+05:30 IST