Kusampudi Srinivas భారతదేశంలోనే అత్యంత నేర చరిత్ర ఉన్న పార్టీ వైఎస్సార్సీపీ..
ABN , First Publish Date - 2022-09-08T16:54:21+05:30 IST
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (liquor scam) ఏపీ (AP)లో మంటలు రేపుతోంది.
అమరావతి (Amaravathi): ఢిల్లీ లిక్కర్ స్కామ్ (liquor scam) ఏపీ (AP)లో మంటలు రేపుతోంది. తాడేపల్లి ప్యాలెస్ (Tadepalli Palace)కు ఆరోపణల సెగలు తాకడంతో సీఎం జగన్ (CM Jagan) ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దీంతో ఆయన నిన్న కేబినెట్లో సహచర మంత్రులపై కస్సుబుస్సులాడారు. ప్రతిపక్షం తనపై తన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తున్నా పట్టించుకోరా అంటూ మండిపడ్డారు. మీడియాలో వస్తున్న కథనాలను ఎందుకు గట్టిగా తిప్పికొట్టడం లేదని నిలదీశారు. దీనిపై స్పందించిన జనసేన నేత కూసంపూడి శ్రీనివాస్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ గతంలో చంద్రబాబు (Chandrababu)పై చేసిన వ్యక్తిగత దూషణలు సీఎం జగన్కు ఇప్పుడు గుర్తుకు రావడంలేదా? అని ప్రశ్నించారు.
జగన్మోహన్ రెడ్డిని అందరూ ధైర్యవంతుడని, గతంలో కేంద్రంలో ఎదిరించిన వ్యక్తి అని అంటారు కానీ.. అత్యంత పిరికి వ్యక్తి ఎవరంటే.. జగన్ అని కూసంపూడి శ్రీనివాస్ అన్నారు. ఎటువంటి వ్యక్తి అంటే.. ‘మీ అందరికీ భయమైతే నా చుట్టు వచ్చి పడుకోండని అంటారాయన.. అంత ధైర్యవంతుడని’ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలపై ప్రభుత్వం చేసిన మంచిపనుల గురించి చెప్పి ముందుకు వెళ్లాలని చెప్పకుండా.. తనను, తన కుటుంబాన్ని కాపాడాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. లిక్కర్ స్కామ్, డ్రగ్స్, గంజాయి వ్యాపారం ఇలా దేశంలో ఎక్కడ ఏం జరిగినా.. ఆ లింకులు వైసీపీలో కొందరు నేతలకు ఉన్నాయని ఆరోపించారు. భారతదేశంలో అత్యంత నేర చరిత్ర ఉన్న ప్రాంతీయ పార్టీ వైఎస్సార్సీపీ అని కూసంపూడి శ్రీనివాస్ అన్నారు. ఏపీలో నడుస్తున్న మద్యం వ్యాపారం.. ఆన్లైన్ కాకుండా క్యాష్ ద్వారా చేయడం, ఆ లింకులు చెన్నైలో ఉండడం, అది ఏ విధంగా నడుపుతుంది.. దీనికి కేంద్రం తాడేపల్లి ప్యాలెస్లో ఉండడం.. తీగ లాగితే డొంకంతా కదులుతుందని, తప్పకుండా స్కామ్ బయటపడుతుందని అన్నారు. మూడేళ్లుగా రాష్ట్రంలో మద్యం మాఫియా నడుస్తోందని కూసంపూడి శ్రీనివాస్ ఆరోపించారు.