Kuwait వెళ్లేవారికి కొత్త ఆంక్షలు.. ఆ దేశానికి వెళ్లేముందు వాటిపై ఓ లుక్కేయండి..
ABN , First Publish Date - 2021-12-23T15:30:39+05:30 IST
కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ నేపథ్యంలో కువైత్ తాజాగా అంతర్జాతీయ ప్రయాణికులకు కొత్త ఆంక్షలు విధించింది.
కువైత్ సిటీ: కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ నేపథ్యంలో కువైత్ తాజాగా అంతర్జాతీయ ప్రయాణికులకు కొత్త ఆంక్షలు విధించింది. శరవేగంగా ప్రబలుతున్న కొత్త వేరియంట్ను కట్టడిచేసేందుకు ఆ దేశ ఆరోగ్యశాఖ విదేశీ ప్రయాణికులకు కొత్త ఆంక్షలు తీసుకోచ్చింది. ఇప్పటికే తొమ్మిది ఆఫ్రికన్ దేశాలపై నిషేధం విధించిన కువైత్ తాజాగా అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. పీసీఆర్ టెస్టు, 10 రోజుల హోం క్వారంటైన్ తదితర కొత్త ఆంక్షలు విధించింది. ఈ మేరకు సోమవారం కీలక ప్రకటన చేసింది.
కువైత్ ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రకారం...
* ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కువైత్ చేరుకోవడానికి 48 గంటల ముందే పీసీఆర్ టెస్టు చేయించుకోవాలి. అలాగే ఆ దేశానికి వెళ్లిన తర్వాత 10 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండడం తప్పనిసరి. ఈ ఆంక్షలు డిసెంబర్ 26 నుంచి అమల్లోకి వస్తాయి.
* అలాగే క్వారంటైన్ పీరియడ్ ముగిసిన 72 గంటల తర్వాత తప్పకుండా మరోసారి పీసీఆర్ టెస్టు నిర్వహించడం జరుగుతుంది.
* ఇక 2022 జనవరి 2 నుంచి కువైత్లో మరో కొత్త రూల్ అమలు కానుంది. రెండో డోసు వ్యాక్సిన్ తీసుకుని 9 నెలలు గడిచిన తర్వాత నుంచి బూస్టర్ డోసు తీసుకోవడం తప్పనిసరి. అలాంటి వారికే ప్రయాణాలు చేయడానికి అనుమతి ఉంటుంది. లేనిపక్షంలో అసలు వ్యాక్సిన్ తీసుకోని వారిగా పరిగణించడం జరుగుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు.