భూ రికార్డుల నమోదుకు రూ.7.3 లక్షలు
ABN , First Publish Date - 2021-01-21T05:30:00+05:30 IST
భూ సంబంధిత రికార్డులకోసం రూ.7.3 లక్షలు వసూలు చేసిన సిబ్బంది, పాసుపుస్తకాల కోసం మరో లక్ష డిమాండు చేశారని, ఆ మొత్తం ఇవ్వకపోవడంతో రికార్డుల్లో తమ పేరు గల్లంతు చేశారని గూడూరుకు చెందిన పప్పు శ్రీధర్, పప్పు రమేష్ ఆరోపించారు.
పాసు పుస్తకాలకు మరో లక్ష
ఇవ్వకుంటే రికార్డుల్లో పేర్లు గల్లంతు
అధికారులను నిలదీసిన బాధితులు
డిజిటల్ కీ దుర్వినియోగంపై అధికారుల అభియోగం
కంప్యూటర్ ఆపరేటర్ సరెండర్
రాపూరు, జనవరి 21: భూ సంబంధిత రికార్డులకోసం రూ.7.3 లక్షలు వసూలు చేసిన సిబ్బంది, పాసుపుస్తకాల కోసం మరో లక్ష డిమాండు చేశారని, ఆ మొత్తం ఇవ్వకపోవడంతో రికార్డుల్లో తమ పేరు గల్లంతు చేశారని గూడూరుకు చెందిన పప్పు శ్రీధర్, పప్పు రమేష్ ఆరోపించారు. ఈ విషయంపై గురువారం సాయంత్రం రెవెన్యూ కార్యాలయంలో అధికారులను గట్టిగా నిలదీయడంతో జనం పెద్ద ఎత్తున గుమిగూడారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తాము మండలంలోని ఏపూరు గ్రామంలో 2006లో 27.9 ఎకరాల పొలాన్ని కొనుగోలు చేసి రిజిస్టరు చేయించుకున్నట్లు తెలిపారు. అనంతరం బ్యాంకులో డాక్యుమెంట్లు పెట్టి రూ.10 లక్షలు రుణం తీసుకున్నామన్నారు. పాస్పుస్తకాల కోసం రెవెన్యూ అధికారులను సంప్రదించగా, కంప్యూటర్ ఆపరేటర్ను కలిసి విషయాలన్నీ వివరించాలని సూచించారన్నారు. పాస్పుస్తకాలు, టెన్, వన్ అడంగల్ నమోదుకు రూ.7.3 లక్షలు ఇవ్వాల్సి ఉందని ఆయన చెప్పడంతో తాము ఆ మొత్తం చెల్లించామన్నారు. గతేడాది డిసెంబరులో తమ పేరుతో పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేసినట్లు తెలిపారు. వాటిని తమ చేతికి ఇచ్చేందుకు మరో లక్ష రూపాయలు కావాలని డిమాండ్ చేశారన్నారు. ఆ మొత్తం ఇవ్వకపోవడంతో రికార్డుల్లో తమ పేరును గల్లంతు చేశారన్నారు. ఈ విషయాన్ని అడిగేం దుకు వచ్చినట్లు వివరించారు.ఈ విషయమై రెవెన్యూ అధికారులు బాధితులపై విరుచుకుపడ్డారు. రెవెన్యూ అఽధికారులకు కలవకుండా కంప్యూటర్ ఆపరేటర్ను ఎలా కలుసా ్తరని, ఏమైనా ఉంటే మీరు డబ్బులు ఇచ్చిన కంప్యూటర్ ఆపరేటర్తోనే మాట్లాడుకోవాలని చెప్పారు. దీంతో చేసేదేం లేక బాధితులు తిరుగుముఖం పట్టారు.
ఆపరేటర్ సరెండర్
రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ను సరెండర్ చేసినట్లు తహసీల్దారు మధుసూదనరావు తెలిపారు. తాము పని వత్తిడిలో ఉన్న సమయంలో తమను ఏమార్చి కంప్యూటర్ ఆపరేటర్ వెంకట రమణయ్య సహకారంతో డిజిటల్ కీని ఉపయోగించి పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేసినట్లు వివరించారు. శ్రీధర్, రమేష్ అనే వ్యక్తులకు పట్టాదారు పాసుపుస్తకాల మంజూరుకు తహసీల్దారు కార్యాలయ సిబ్బందికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఈ విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, కంప్యూటర్ ఆపరేటర్ను సరెండర్ చేశామన్నారు. అర్హత ఉంటే అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేస్తామని వివరించారు.