ఆటా మహాసభలకు భారీ స్థాయిలో ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-06-30T10:52:33+05:30 IST

జూలై 1వ తేదీ నుంచి మూడు రోజులపాటు వాషింగ్టన్‌ డీసీలో ఆటా మహాసభలు అట్టహాసంగా జరగనున్నాయి. అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ మహాసభలకు పెద్ద

ఆటా మహాసభలకు భారీ స్థాయిలో ఏర్పాట్లు

జూలై 1 నుంచి మూడు రోజుల పాటు నిర్వహణ 

( వాషింగ్టన్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి కిలారు ముద్దుకృష్ణ)

జూలై 1వ తేదీ నుంచి మూడు రోజులపాటు వాషింగ్టన్‌ డీసీలో ఆటా మహాసభలు అట్టహాసంగా జరగనున్నాయి. అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ మహాసభలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు భువనేశ్‌ భుజాల తెలిపారు. ఉత్సవాలకు సంబంధించిన విశేషాలను ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌ (సద్గురు) ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారని తెలిపారు. ఉత్సవాల ముగింపు రోజున ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీత విభావరిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కవులు, కళాకారులు, రాజకీయ నేతలు, సినీ నటులు ఉత్సవాలకు తరలి వస్తున్నట్లు భువనేశ్‌ తెలిపారు. క్రికెటర్లు కపిల్‌దేవ్‌, సునీల్‌ గవాస్కర్‌ కూడా హాజరవుతారని చెప్పారు.  

ఆటా మహాసభల్లో పాల్గొననున్న ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి) : అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌(ఆటా) 17వ మహాసభల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో జూలై 1 నుంచి 3 వరకు ఆటా మహాసభలు జరగనున్నాయి. యూత్‌ కన్వెన్షన్‌లో పాల్గొనాలని కవితను ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. జూలై 2న ఆటా సభల్లో పాల్గొని, అదే రోజు మధ్యాహ్నం తెలంగాణ పెవిలియన్‌ను ఆమె ప్రారంభిస్తారు. రాత్రి 8 గంటలకు దాదాపు 10 వేల మంది ప్రతినిధులు హాజరయ్యే ఆటా ప్రైమ్‌ మీట్‌కు కవిత అతిధిగా హాజరవుతారు. అదే సమావేశంలో బతుకమ్మ పండుగపై ఆటా ప్రచురించిన ప్రత్యేక సంచికను ఆమె ఆవిష్కరిస్తారు.

Updated Date - 2022-06-30T10:52:33+05:30 IST