రాజస్థాన్ రాయల్స్ కోచింగ్ యూనిట్లో ఎందుకు చేరానంటే?: వెల్లడించిన మలింగ
ABN , First Publish Date - 2022-03-23T01:27:36+05:30 IST
ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్లో తాను చేరడం వెనకున్న కారణాన్ని శ్రీలంక
జైపూర్: ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్లో తాను చేరడం వెనకున్న కారణాన్ని శ్రీలంక మాజీ బౌలర్ లసిత్ మలింగ వెల్లడించాడు. రాజస్థాన్ ఫ్రాంచైజీ ఈ నెల 11న మలింగను తమ జట్టు బౌలింగ్ కోచ్గా నియమించింది. అంతకుముందు మలింగ 11 సంవత్సరాల పాటు ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించాడు. 122 మ్యాచ్లు ఆడడమే కాదు 2018 సీజన్లో ఆ జట్టు బౌలింగ్ కోచ్గానూ వ్యవహరించాడు.
రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా వ్యవహరించిన కుమార సంగక్కర కోచింగ్ విషయమై గతేడాదే తనను అడిగాడని 38 ఏళ్ల మలింగ గుర్తు చేసుకున్నాడు. కరోనా వైరస్, బబుల్ ఆంక్షల కారణంగా కుటుంబానికి దూరంగా ఉండకూడదని అప్పట్లో తాను నిర్ణయించుకున్నానని అన్నాడు. తాను ఎంతగానో ప్రేమించే క్రికెట్ కోసం తన అనుభవాన్ని తిరిగి ఉపయోగించాలని అనుకుంటున్నట్టు చెప్పాడు.
మలింగ ఇప్పటికే ముంబైలోని రాజస్థాన్ రాయల్స్ క్యాంపులో చేరి బౌలర్లకు శిక్షణ ప్రారంభించాడు. ఈ కొత్త పాత్రలో ఒదిగిపోతానని మలింగ పేర్కొన్నాడు. తాను ముంబైకి ఆడినప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఎప్పుడూ గట్టి పోటీ ఇచ్చేదని గుర్తు చేసుకున్నాడు. శిక్షణ ఇవ్వడం, తన అనుభవాన్ని వారికి అందించడం తనకు పూర్తిగా కొత్త విషయమన్నాడు. రాజస్థాన్తో కలిసి పనిచేస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని మలింగ పేర్కొన్నాడు.