చరిత్ర తెలుసుకుని మాట్లాడండి

ABN , First Publish Date - 2021-06-20T05:06:26+05:30 IST

విజయనగరం రాజుల చరిత్రను తెలుసుకుని మాట్లాడాలని.. నోరు పారేసుకుంటే ఊరుకునేది లేదని టీడీపీ జిల్లా నాయకులు హెచ్చరించారు. మాన్సాస్‌ చైర్మన్‌ అశోక్‌ గజపతిరాజును జైలుకు పంపిస్తామని వైసీపీ నేత విజయసాయిరెడ్డి మాట్లాడటాన్ని ఖండిస్తూ శనివారం విజయనగరంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

చరిత్ర తెలుసుకుని మాట్లాడండి
టీడీపీ జిల్లా కార్యాలయం అశోక్‌ బంగ్లాలో మాట్లాడుతున్న నాయకులు

మీరు జైలు కెళ్లి.. మమ్మల్ని పంపిస్తామంటే కుదరదు

 విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన టీడీపీ నాయకులు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

విజయనగరం రాజుల చరిత్రను తెలుసుకుని మాట్లాడాలని.. నోరు పారేసుకుంటే ఊరుకునేది లేదని టీడీపీ జిల్లా నాయకులు హెచ్చరించారు. మాన్సాస్‌ చైర్మన్‌ అశోక్‌ గజపతిరాజును జైలుకు పంపిస్తామని వైసీపీ నేత విజయసాయిరెడ్డి మాట్లాడటాన్ని ఖండిస్తూ శనివారం విజయనగరంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్యారాణి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు మాట్లాడుతూ మచ్చలేని నాయకునిపై ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. తప్పుడు ఆలోచనలున్న వారికి అందరూ తప్పిదాలు చేస్తున్నట్లే కన్పిస్తుందని, ఇది సరికాదని అన్నారు. ట్రస్టు చైర్మన్ల విషయంలో బైలాను చదవాలని కోరారు. రొటేషన్‌ పద్ధతిలో చైర్మన్‌ను మార్పు చేశామని జీఓలో పేర్కొన్నారని, రొటేషన్‌ అన్నది బైలాలో ఎక్కడుందని ప్రశ్నించారు. కోటిపల్లి భూముల నుంచి ఇసుక తవ్వకాలు ఎవరు చేశారో తేల్చాలని డిమాండ్‌ చేశారు. ఇసుక తవ్వకాలకు అనుమతిస్తూ ఎవరు సంతకాలు చేశారో వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. 16నెలల పాటు జైలులో ఉండి వచ్చిన విజయసాయిరెడ్డికి నీతి, నిజాయితీ గురించి మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ జగదీష్‌, టీడీపీ జిల్లా పూర్వ అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ కనకమహాలక్ష్మి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ బొద్దుల నరసింగరావు, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ కె.మురళి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-20T05:06:26+05:30 IST