పాదరక్షలు విడిచి ప్రవేశించాలా?

ABN , First Publish Date - 2021-10-19T05:37:53+05:30 IST

ఈ నెల 14వ తేదీన ఆంధ్రజ్యోతిలో వెంకట కిషన్ ఇట్యాల రాసిన ‘కార్మికులవి కాళ్లు కావా?’ అనే వ్యాసంలో చెప్పిన విషయం కొత్త ఆలోచనలను పురిగొల్పింది....

పాదరక్షలు విడిచి ప్రవేశించాలా?

ఈ నెల 14వ తేదీన ఆంధ్రజ్యోతిలో వెంకట కిషన్ ఇట్యాల రాసిన ‘కార్మికులవి కాళ్లు కావా?’ అనే వ్యాసంలో చెప్పిన విషయం కొత్త ఆలోచనలను పురిగొల్పింది. బ్యాంకులోనో, ప్రభుత్వ కార్యాలయంలోనో పనిచేసే ప్రతి ఉద్యోగి తన పాదరక్షలతోనే ప్రవేశిస్తాడు. అదే ఆ కార్యాలయానికి ఏదైనా పనిమీద వచ్చినవారు తమ పాదరక్షలను బయటిద్వారం వద్ద విడిచి లోపలకి ప్రవేశించాలి. కూర్చుని పనిచేసే హక్కు ఎలా ఉందో, అలాగే ప్రతి మనిషికి పాదరక్షలు ధరించే హక్కు ఉంది. పైగా వాటి పేరే పాదరక్షలు. మనిషికి రక్షణ కల్పించేవి. కరోనా వంటి అంటువ్యాధులు కరచాలనం చేయడం ద్వారా వ్యాప్తి చెందుతున్నాయన్నారే తప్ప పాదాల ద్వారా కానీ, పాదరక్షలు ధరించటం వల్ల కానీ వ్యాప్తి చెందుతున్నట్లు ఎవరూ చెప్పలేదు. అందుకే కాళ్లతో కొట్టే ‘ఫుట్ ఆపరేటెడ్ శానిటైజర్ డిస్పన్సర్లు’ మనకు ప్రతిచోటా దర్శనమిస్తున్నాయి. బిగ్‌బజార్, డీమార్టు, సినిమా థియేటర్లు, హోటళ్లలో అటువంటి నిబంధన తారసపడలేదు కానీ చిన్న, మధ్య తరహా దుకాణాలు, వ్యాపార సంస్థల ముంగిట ‘చెప్పులు విడిచి రావలెను’ సూచనలు కనిపిస్తుంటాయి. కళ్లద్దాల దుకాణాల వద్ద, ఫోటో స్టూడియోల వద్ద ఇటువంటి సూచన బోర్డులు అన్ని ప్రాంతాల్లోనూ మనం నిత్యం చూస్తుం టాం. కొన్ని చోట్ల దుకాణాదారులు వచ్చిన వారిని మౌఖికంగా ఈ మేరకు ఆదేశిస్తున్నారు. పాదరక్షలు బయట వదిలి వెళ్లాలన్న నిబంధనే ఒక అనాచారం. అందువల్ల కార్మికులకు కూర్చుని పనిచేసే హక్కు కల్పిస్తూ, అలాగే పాదరక్షలు ధరించి వినియోగదారుడు అన్ని వ్యాపారసంస్థలలోను ప్రవేశించవచ్చని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ కింద రాష్ట్రప్రభుత్వం తగిన ఆదేశాలు జారీ చేయాలి. వాటిని ఉల్లంఘించిన వారికి జరిమానా విధించాలి.

పింగళి, విశాఖ

Updated Date - 2021-10-19T05:37:53+05:30 IST