కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయిన ముగ్గురు ఫ్రెండ్స్.. ‘బీటెక్ ఛాయ్’ పేరుతో టీ స్టాల్.. ఇప్పుడు వీళ్ల సంపాదనెంతో తెలిస్తే..
ABN , First Publish Date - 2022-05-25T17:30:25+05:30 IST
కేరళకు చెందిన ఆ స్నేహితులు ముగ్గురూ ఇంజినీరింగ్ చదివి మంచి ఉద్యోగాలు చేసేవారు.. క
కేరళకు చెందిన ఆ స్నేహితులు ముగ్గురూ ఇంజినీరింగ్ చదివి మంచి ఉద్యోగాలు చేసేవారు.. కరోనా కష్ట కాలంలో ముగ్గురూ ఉద్యోగాలు కోల్పోయారు.. తిరిగి ఉద్యోగాలు సాధించేందుకు ప్రయత్నాలు చేశారు.. అవేవీ ఫలితాలనివ్వకపోవడంతో స్వయంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నారు.. ‘బీటెక్ ఛాయ్’ పేరుతో టీ స్టాల్ ప్రారంభించారు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వీరి టీ స్టాల్స్ ఉన్నాయి.. వీరి సంపాదన ఏడాదికి రూ.20 లక్షలు.
ఇది కూడా చదవండి..
Leonardo Del Vecchio.. అనాథ శరణాలయంలో మొదలైన అతని జీవితం ఏ స్థాయికి చేరిందంటే..
కేరళకు చెందిన ఆనంద్ అజయ్ (25) బైజూస్ సంస్థలో బిజినెస్ డెవలపర్గా పని చేసేవాడు. కరోనా లాక్డౌన్ సమయంలో అతని ఉద్యోగం పోయింది. అలాగే మహ్మద్ సైఫీ (25), మహ్మద్ షానావాజ్ (28) కూడా ఉద్యోగాలు పోగొట్టుకుని కష్టాల్లో పడ్డారు. ఏదైనా వ్యాపారం ప్రారంభించాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి కావాలి. అందుకే తక్కువ మొత్తంతో ముగ్గురూ కలిసి టీ స్టాల్ పెట్టాలనుకున్నారు. తమ టీ స్టాల్కు `బీటెక్ ఛాయ్` అని పేరు పెట్టారు. `అప్పుడే ఉద్యోగం పోయింది. తల్లిదండ్రులు ఆ బాధలో ఉండగా నేను టీ స్టాల్ పెడతానని చెప్పాను. వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంత చదువు చదివి టీ అమ్ముకుంటావా? అని అడిగారు. వారిని ఒప్పించడానికి చాలా కష్టపడ్డాన`ని అజయ్ చెప్పాడు.
ముగ్గురు స్నేహితులు కేవలం రూ1.5 లక్షల పెట్టుబడితో 2021 అక్టోబర్లో కేరళలోని కొల్లంలో `బీటెక్ ఛాయ్`ను ప్రారంభించారు. ఆ టీ స్టాల్లో రకరకాల టీలు లభ్యమవుతాయి. అసోం టీ, మౌంటెన్ బటర్ టీ, డార్జిలింగ్ టీ, కశ్మీరీ కహ్వా వంటి వంద రకాలు టీలు అక్కడ లభ్యమవుతాయి. రూ.5 నుంచి రూ.50 వరకు ఏ రేటులో కావాలంటే ఆ రేటులో అక్కడ టీ దొరకుతుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా `బీటెక్ ఛాయ్` పేరుతో ఔట్లెట్లను ప్రారంభించారు. వీరు ప్రారంభించిన ఔట్లెట్లో రోజుకు రూ.10 వేల వరకు బిజినెస్ జరుగుతుంది. ఏడాదికి రూ.36 లక్షల టర్నోవర్తో ఆ టీ స్టాల్ దిగ్విజయంగా సాగుతోంది.