
న్యూఢిల్లీ: దేశంలో నానాటికీ పెరుగుతోన్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగాన్ని నిరసిస్తూ దేశవ్యాప్త నిరసనకు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. మే 25 నుంచి 31 వరకు ఈ నిరసన చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్లన్నింటికీ ఈ విషయమై సమాచారం అందించాయి. అందరూ ఒక్కతాటిపైకి వచ్చి నిరసనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి. కాగా, పలు డిమాండ్ల జాబితాను కేంద్రం ముందుకి తీసుకువచ్చాయి. పెట్రోల్ ఉత్పత్తులపై పెరిగిన ధరలను తగ్గించడం, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా గోధుమ సరఫరాను పునరుద్దరించడం, నిత్యవసర వస్తువుల పంపిణీ ప్రజా పంపిణీని బలోపేతం చేయడం లాంటి డిమాండ్లు ఈ జాబితాలో ఉన్నాయి. "నిరంతరంగా పెరుగుతున్న ధరలు ప్రజలకు మోయలేని భారం అవుతోంది. ఎంతో మంది ఆకలితో బాధపడుతున్నారు. మరెందరో పేదరికంలోకి మళ్లుతున్నారు. దీనికితోడు నిరుద్యోగం సైతం తీవ్ర స్థాయిలో పెరగడం మరింత తీవ్ర సమస్యగా మారింది. ఒకవైపు నిరుద్యోగం, మరొకవైపు ధరల పెరుగుదల.. ప్రజల కష్టాలను నానాటికీ తీవ్రతరం చేస్తున్నాయి" అని వామపక్షాలు పేర్కొన్నాయి.
ఇవి కూడా చదవండి