రైతు కుటుంబాల్లో వెలుగులు నింపుతాం

ABN , First Publish Date - 2022-09-26T04:57:54+05:30 IST

రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలనే సంకల్పంతో ఫార్మర్స్‌ ఫస్ట్‌ ఫౌండేషన్‌ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఆ సంస్థ చైర్మన్‌చక్రధర్‌గౌడ్‌ తెలిపారు.

రైతు కుటుంబాల్లో వెలుగులు నింపుతాం
ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.కోటి చెక్కును అందజేస్తున్న చక్రధర్‌గౌడ్‌, ఆయన సతీమణి ఆరోషిక

ఫార్మర్స్‌ ఫస్ట్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ చక్రధర్‌గౌడ్‌

సిద్దిపేట అగ్రికల్చర్‌, సెప్టెంబరు 25: రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలనే సంకల్పంతో ఫార్మర్స్‌ ఫస్ట్‌ ఫౌండేషన్‌ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఆ సంస్థ చైర్మన్‌చక్రధర్‌గౌడ్‌ తెలిపారు. రైతుల కుటుంబాలను రాజకీయాలకతీతంగా ఆదుకుంటున్నామని చెప్పారు. ఆదివారం సిద్దిపేటలో ఫౌండేషన్‌ఆధ్వర్యంలో ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున 100 కుటుంబాలకు కోటి రూపాయలను ఆయన భార్య ఆరోషికతో కలిసి అందజేసి మాట్లాడారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, తనది రైతు పార్టీ అని తెలిపారు. ప్రపంచమంతా కరోనాతో అల్లాడుతున్నా.. దేశానికి అన్నం పెట్టిన గొప్పవ్యక్తి రైతు అని కొనియాడారు. గతంలో 200 కుటుంబాలను ఆర్థికంగా ఆదుకున్నామని, ఇంకా అవసరమైతే మరో 500 మందికి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. దీనిపై త్వరలోనే హైకోర్టులో కేసు వేయనున్నట్లు తెలిపారు. రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్న కల్తీ విత్తనాలు, పురుగుల మందులు అమ్మే వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ హాజరు కావాల్సి ఉన్నా అనివార్య కారణాలతో రాలేకపోయారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పులి రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-26T04:57:54+05:30 IST