త్యాగాలను స్మరించుకుందాం
ABN , First Publish Date - 2022-08-12T05:52:19+05:30 IST
భరతమాత విముక్తి కోసం మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకోవడం మన అందరి కనీస బాధ్యత అని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు.
- కలెక్టర్ శ్రీహర్ష
- గద్వాల పట్టణంలో ఉత్సాహంగా ఫ్రీడం రన్
- పాల్గొన్న జడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి
గద్వాల టౌన్, ఆగస్టు 11 : భరతమాత విముక్తి కోసం మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకోవడం మన అందరి కనీస బాధ్యత అని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది నిర్వహిస్తున్న స్వాతంత్య్ర వజ్రోత్సవాల సంద ర్భంగా మహనీయుల త్యాగాలను స్మరిస్తూ వారి ఆశయాల సాధనకు పునరంకిత మవుదామని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరిం చుకుని గురువారం పట్టణంలో ఫ్రీడం రన్ నిర్వహించారు. స్థానిక రాజీవ్ సర్కిల్ నుంచి ప్రారంభమైన రన్ను జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, జడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎస్పీ రంజన్ రతన్కుమార్, మునిసిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే, రాష్ట్రంలో ఈ నెల ఎనిమిది నుంచి 21వ తేదీ వరకు వజ్రోత్సవాల నిర్వహణకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారని, ఈ నేపథ్యంలో ఉత్సవాల్లో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. మహోన్నతమైన మనదేశ వారసత్వాన్ని, స్వాతంత్య్ర పోరాట చరిత్రను మనమందరం సగర్వంగా స్మరించుకుందామన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, యువతీ, యువకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.