కుతుబ్ మినార్ వద్ద తవ్వకాలు!
ABN , First Publish Date - 2022-05-23T08:17:38+05:30 IST
వారాణసీలోని జ్ఞానవాపి మసీదు సర్వే వివాదం ఇంకా సమసిపోకముందే.. మరో వివాదం తెరమీదికి వచ్చింది.
పురావస్తు శాఖకు కేంద్రం ఆదేశం
అలాంటిదేమీ లేదు
మినార్ను ముట్టుకోం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి
న్యూఢిల్లీ, మే 22: వారాణసీలోని జ్ఞానవాపి మసీదు సర్వే వివాదం ఇంకా సమసిపోకముందే.. మరో వివాదం తెరమీదికి వచ్చింది. ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన కుతుబ్మినార్ వద్ద తవ్వకాలు జరపాలని కేంద్ర సాంస్కృతిక శాఖ పురావస్తు శాఖ అధికారులను ఆదేశించడం సంచలనంగా మారింది. మినార్ వద్ద తవ్వకాలు జరపడంతోపాటు ఐకానోగ్రఫీ నిర్వహించాలని పేర్కొంది. అంతేకాదు, సాధ్యమైనంత త్వరలో తవ్వకాలకు సంబంధించిన నివేదికను కూడా ఇవ్వాలని కోరింది. కుతుబ్ మినార్ తవ్వకాల వివాదంపై కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి ఆదివారం స్పందించారు. కుతుబ్మినార్ వద్ద ఎలాంటి సర్వేలు చేపట్టబోమని, ప్రస్తుతం వస్తున్న వార్తలు వదంతులేనని ఆయన కొట్టిపారేశారు. కుతుబ్ మినార్ను అద్భుత కట్టడంగా ఆయన అభివర్ణించారు. ఈ విషయంపై వదంతులను కట్టిబెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కుతుబ్ మినార్కు సంబంధించి కోర్టులు ఎలాంటి దిశానిర్దేశం చేయలేదని.. ఈ నేపథ్యంలో పురావస్తు సర్వే అనే మాటే ఉత్పన్నం కాదని అన్నారు.