సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేద్దాం
ABN , First Publish Date - 2022-07-01T06:20:28+05:30 IST
గడప గడపకూ కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు బీజేపీ సిద్ధంతాలను తీసుకెళ్లి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేద్దామని, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని కశ్మీర్ బీజేపీ నాయకుడు, జాతీయ మాజీ కార్యదర్శి ఆశిష్ సూద్ అన్నారు
- తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే
- పార్టీ జాతీయ మాజీ కార్యదర్శి ఆశిష్సూద్
గద్వాల, జూన్ 30 : గడప గడపకూ కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు బీజేపీ సిద్ధంతాలను తీసుకెళ్లి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేద్దామని, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని కశ్మీర్ బీజేపీ నాయకుడు, జాతీయ మాజీ కార్యదర్శి ఆశిష్ సూద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్వీ ఈవెంట్ హాల్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వల్లనే నేడు భారతదేశం ప్రపంచంలో కీర్తింపబడుతున్నదని వివరించారు. కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలను నిలిపివేయకుండా, పేదలకు కడుపు నిండా భోజనం పెట్టారని చెప్పారు. శత్రుదేశం, ఉగ్రవాదుల నుంచి దేశాన్ని కాపాడుతున్నారన్నారు. అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణకు కూడా పథకాలు అందిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ వాటికి వక్రభాష్యం చెప్తూ తనవిగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. దీన్ని కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో నియంత, కుటుంబ పాలనను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేస్తున్నారని, ప్రతీ పథకం అమలులో అవినీతి వేళ్లూనుకు పోయిందని ప్రజలకు వివరించాలని చెప్పారు. రైతులను నట్టేట ముంచి వారు కడ్తున్న పన్నులతో జల్సాలు చేస్తున్నారని వివరించారు. పంజాబ్లో మృతి చెందిన రైతులకు ఎవరి సొమ్ముతో పరిహారం ఇచ్చారని ప్రశ్నించారు. ఇక్కడి రైతులు చనిపోయినా, ఆత్మహత్యలు చేసుకున్నా ఒక్క పైసా ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలు కంకణబద్ధులై పని చేయాలని కోరారు. హైదరాబాద్లో మూడవ తేదీన నిర్వ హించే ప్రధాని బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శులు డీకే స్నిగ్ధారెడ్డి, రవి ఎక్బోటే, ఇన్చార్జి రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కృషి :
బిహార్ రాష్ట్రం పాట్నా ఎమ్మెల్యే ప్రేమ్కుమార్
అలంపూరు : రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని బిహార్ రాష్ట్రం, పాట్నా ఎమ్మెల్యే ప్రేమ్కుమార్ అన్నారు. అలంపూరులో సీనియర్ బీజేపీ నాయకుడు జగదీష్ నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్తరల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్లో నిర్వహించనున్న ప్రధాని నరేంద్రమోదీ బహిరంగసభకు అధికసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. బూత్స్థాయి కార్యకర్తలను సమావేశానికి తీసుకువెళ్లాలని, జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డికి సూచించారు. దేశంలో ప్రతీ ఒక్కరికీ కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జలగరి అశోక్, జిల్లా ఉపాధ్యక్షుడు మధుసూదన్గౌడ్, సీనియర్ నాయకుడు జగదీష్ పాల్గొన్నారు.