బలవంతపు స్వాధీనం

ABN , First Publish Date - 2021-07-24T06:24:51+05:30 IST

ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ అధికారులు తాళాలు వేశారు. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ సంఘటన మండలంలోని పొందూరులో చోటుచేసుకుంది.

బలవంతపు స్వాధీనం
అధికారులు తాళాలు వేసిన ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌

పంపుహౌస్‌కు రైతుల తాళం ఉండగానే మరోటి వేసిన ఏపీఎ్‌సఐడీసీ అధికారులు

సీజన్‌ మొదలవడంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన

తాగునీటి చెరువు పంపింగ్‌కూ ఇక్కట్లు

ముంచుకొస్తున్న మంచినీటి ఎద్దడి


పొందూరు(టంగుటూరు), జూలై 23 : ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ అధికారులు తాళాలు వేశారు. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ సంఘటన మండలంలోని పొందూరులో చోటుచేసుకుంది.


పొందూరు ఎత్తిపోతల పథకం పురుడుపోసుకుందిలా...

అది 1987వ సంవత్సరం.. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి... అప్పటి జిల్లా కలెక్టర్‌ జయప్రకా్‌షనారాయణ ఎత్తిపోతల పథకాలను బాగా ప్రోత్సహించారు. అందులో భాగంగా పొందూరులోనూ ఆయన పర్యటించారు. ఆ గ్రామంలో అప్పటికే రైతులు సొంతంగా ముసి మీద నిర్వహించుకుంటున్న చిన్నచిన్న ఎత్తిపోతల పథకాలను చూసి ముచ్చటపడ్డాడు. ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వపరంగా తగిన ఆర్థిక ప్రోత్సాహం అందిస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. అదే సమయంలో అప్పటికే వాడుకలో ఉన్న చిన్న పథకం అభివృద్ధికి లక్ష రూపాయిలు ఆర్థిక సాయం అందించారు. ఈ పథకానికే రైతులు పొందూరు ఎత్తిపోతల పరస్పర సహాయక సహకార సంఘంగా నామకరణం చేశారు.


స్కీం పనులు ప్రారంభం

జిల్లా కలెక్టర్‌ అందించిన ప్రోత్సాహంతో రైతులు స్కీం పనులు ప్రారంభించారు.  ప్రారంభంలో కొందరు రైతులు అడ్డంకులు చెప్పినా తరువాత సర్దుబాటు చేసుకొని పంప్‌ హౌస్‌ నిర్మాణం, కొంత దూరం పైప్‌లైన్‌ నిర్మించారు. పూర్తి చేసిన ఆ పనులతో స్కీం ల క్ష్యం సంపూర్ణంగా నెరవేరలేదు. దీం తో రైతులు డీలాపడ్డారు. 1996 ప్రాం తంలో మాగుంట పార్వతమ్మ ఎంపీగా వచ్చారు. ఆమె స్పందించి స్కీం అభివృద్ధి పనులకు తన గ్రాంట్‌ నుంచి రూ.6లక్షలు మంజూరు చేశారు. ఈ నిధుల ద్వారా మిగిలిన పైప్‌లైన్‌ పూర్తి చేసి స్కీం ప్రారంభించారు. స్కీంకు మళ్లీ ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. పైపులైన్‌ లీకులతో సతమతమయ్యారు.


కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో భారీగా నిధులు

ఇలాగే 15 ఏళ్లు గడిచిపోయాయి. కాలక్రమంలో స్కీం మరుగునపడుతుండగా కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా వచ్చారు. ఆయన ఒంగోలు రాగా స్కీం రైతులు అప్పటి డీసీసీ అధ్యక్షుడు పోతుల రామారావు ద్వారా ముఖ్యమంత్రిని కలిసి స్కీం పరిస్థితి వివరించారు. వెంటనే ఆయన రూ.4.90 కోట్లు మంజూరు చేశారు. అధికారులు టెండర్లు పిలిచి ఏపీఎ్‌సఐడీసీ స్కీం పనులను సంపూర్ణంగా పూర్తి చేసింది.


గత ఏడాదే రైతులకు అప్పగింత

గతేడాది ఫిబ్రవరి 4న ఏపీఎ్‌సఐడీసీ అధికారులు స్కీం ను ఆయకట్టు రైతుల కమిటీకి అప్పగించారు. స్కీం ప్రారంభం నాటి నుం చి కమిటీ అధ్యక్షుడిగా పాపినేని వెంకటేశ్వర్లు కొనసాగుతున్నారు. వెంటనే కమిటీ స్కీం ద్వారా గ్రామంలోని మూడు చెరువులకు పుష్కలంగా నీరు నింపింది. ఒక చెరువు నీటిని పూర్తిగా తాగునీటి అవసరాలకు వినియోగించారు. మిగిలిన రెండు చెరువుల నీటిని 200 ఎకరాల్లో ఆరుతడి పంటలకు వాడారు. ఈఏడాది పూర్తి స్థాయిలో స్కీంను వినియోగంలోకి తీసుకురావాలని అనుకోగా ఆటంకం ఎదురైంది.


స్కీం స్వాధీనం చేయాలంటూ ఏపీఎ్‌సఐడీసీ హెచ్చరికలు

స్కీంకు తాళాలు వేసి తమకు స్వాధీనం చేయాలంటూ కమిటీకి ఈ నెల మొదటి వారంలో ఐడీసీ నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. రైతుల కమిటీ ఐడీసీ అధికారులను కలసి చర్చించింది. వివాదాలలోని స్కీంలను స్వాధీనం చేసుకోవాలని, తిరిగి స్కీంలకు ఎన్నికలు జరిగే వరకూ ఐడీసీ ఆధీనంలోనే స్కీం కొనసాగాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం:41 విడుదలు చేసిందని అధికారులు చెప్పారు. తమపై ఒత్తిడి ఉందని, తాళాలు స్వాధీనం చేయాల్సిందేనని అధికారులు రైతులకు తేల్చిచెప్పారు.


నోటీసులిచ్చిన ఐడీసీ

ముందు నోటి మాటగా చెప్పిన ఐడీసీ స్కీం కమిటీకి ఈసారి ఏకంగా నోటీస్‌ జారీ చేసింది. ఈనెల 20లోగా స్కీం తాళాలు, రికార్డులు తమ స్వాధీనం చేయాలని, ఇది ప్రభుత్వ నిబంధన అని ఈనెల 14న జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు.


గ్రామ రాజకీయమే కారణమా?

స్కీం పరిధిలో 1,047 ఎకరాల ఆయకట్టు రైతుల పరిస్థితి అయోమయంగా మారింది. ప్రస్తుతం సీజన్‌ కావడంతో మిర్చి సాగు చేద్దామంటే స్కీం కొనసాగుతుందా లేదా అని రైతులు సందేహిస్తున్నారు. కౌలు రైతులూ ఆయకట్టు భూములను కౌలుకు తీసుకునేందుకు భయపడుతున్నారు. స్కీం సకాలంలో నడపకపోతే అంతంత కౌలు చెల్లించి తీసుకుని అప్పులు పాలు కావాల్సివస్తుందని వాపోతున్నారు. పొగాకు, శనగ సాగుకు ఆరుతడికి నీరు అందుతుందా, లేదా అని కూడా అనుమానిస్తున్నారు. ఆయకట్ట్టు రైతుల పరిస్థితి వారికే అంతుబట్టడం లేదు. అంతేగాక సగానికి పైగా గ్రామానికి తాగునీటి ఆధారంగా ఉన్న చెరువుకు నీరు పెట్టుకునే దారి లేకుండా పోయిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కీం పని చేయకుంటే తాగునీటికి ఇక్కట్లు తప్పవని వాపోతున్నారు. స్కీంను కమిటీకి అప్పగించి రైతులను ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామంలోని అధికార పార్టీకి చెందిన కొందరి ఒత్తిడి కారణంగానే ఐడీసీ దూకుడుగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. గ్రామంలో ఇంకా రెండు స్కీంలు ఉన్నా ఈ ఒక్కదానినే స్వాధీనం చేసుకోవడం వెనుక గ్రామ సర్పంచ్‌ ఎన్నికల రాజకీయమే కారణమని సమాచారం. ఈ గ్రామంలో వైసీపీ మద్దతుదారు సర్పంచ్‌ ఓడిపోయారనే కక్షతోనే ఇలా చేశారని గ్రామస్థులు చెబుతున్నారు.


15 తేదీ నాడే స్కీంకు తాళాలు వేసిన ఐడీసీ

ముందు ఈనెల 20లోగా స్కీం తాళాలు ఇవ్వాలని నోటీస్‌ ద్వారా కమిటీకి తెలిపిన ఐడీసీ అధికారులు 15వ తేదీ నాడే స్కీం దగ్గరకు వచ్చి తాళం చేసి వెళ్లారు. మరుసటి రోజే కమిటీ వారు అధికారులను కలవగా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే స్వాధీనం చేసుకున్నట్లు చెప్పి పంపించారు. కమిటీ తిరిగి సోమవారం స్పందనలో జిల్లా కలెక్టర్‌ను కలసి సమస్య వివరించారు. అయినా ఇప్పటి వరకు రైతులకు సమస్య పరిష్కారం కానేలేదు.


రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తా

ఉదయభాస్కర్‌, డీఈ, ఏపీఎ్‌సఐడీసీ

రైతులను ఇబ్బంది పెట్టాలన్నది మా ఉద్దేశం కాదు. ప్రభుత్వ జీవో ఆధారంగానే స్కీంకు తాళం వేశాం. అం దులో మాపై ఎవరి ఒత్తిడీ లేదు. రైతులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా స్కీం కొనసాగేందుకు మధ్యేమార్గంగా ప్రయత్నిస్తాం. ్లస్కీంకు సంబంధించిన విలువైన వస్తువులు, రికార్డులు భద్రపరచాల్సిన బాధ్యత మాదే. అందుకే కమిటీ తాళం ఉండగానే మేము మరో తాళం వేశాం.



Updated Date - 2021-07-24T06:24:51+05:30 IST